హనుమ నామాన్ని ఉచ్చరిస్తే మనలను బాధించడానికి వచ్చిన భూతప్రేతాదులు అవి విని పారిపోతాయిట.
జపము అనేది చాలా విశేషం. జపం బయటికి పలకకుండా మనస్సుతో చేయవచ్చు. పెదవి కదుపుతూ శబ్దం వినపడకుండా కూడా చేయవచ్చు. అది జపయజ్ఞం. హనుమన్నామాన్ని జపంగా నిరంతరం చేస్తే రోగములు, పీడలు పోతాయి. అది హనుమాన్ చాలీసా పారాయణ క్రమంతోనైనా కావచ్చు, హనుమంతుని నామము కానీ, మంత్రము గానీ జపించవచ్చు. మంత్రమైతే ఉపదేశాదుల అవసరమున్నది. నామమైతే ఉపదేశాలు లేకున్నా హనుమంతునే గురువుగా భావించుకొని చేసుకోవచ్చు. "శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయజయ హనుమాన్’ ఇది మహా మంత్రంగా శాస్త్రం చెప్తోంది. ఇది రోగహరణమైన మంత్రం. ఇంకొక రోగహరణమైన ప్రక్రియ మనకు శాస్త్రంలో చెప్తున్నారు.
హనుమంతునికి ఒకచోట పన్నెండు నామాలు, ఒకచోట ఇరవై ఏడు నామాలు, ఒకచోట ఎనిమిది నామాలు చెప్పారు. దేని ప్రయోజనం దానిదే. పన్నెండు నామాలు "హనుమాన్ అంజనా సూనోః వాయుపుత్రో మహాబలః" - ఇది స్వాపకాలే పఠేన్నిత్యం, యాత్రాకాలే విశేషతః - ప్రయోగం అక్కడే చెప్పారు. నిద్రించే సమయంలో కానీ ప్రయాణ సమయంలో కానీ దీనిని పఠిస్తే పీడలు తొలగి విజయం లభిస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఇరవై ఏడు నామాలు చాలా విశేషమైన ఫలాన్ని ప్రదానం చేస్తుంది. సుందరహనుమాన్మహామంత్రం అని చెప్పబడుతోంది. ఇక్కడ ఎనిమిది నామాలు రోగహరణ ప్రక్రియగా చెప్పారు.
రామభక్తః మహాతేజాః కపిరాజో మహాబలః
ద్రోణాద్రి హారకః మేరు పీఠకార్చన కారకః
దక్షిణాసా భాస్కరః సర్వవిఘ్న వినాశకః!!
ద్రోణాద్రి హారకః అంటే కైలాస పర్వతానికి సమీపంలో ఉన్నటువంటి ద్రోణాద్రి, అందులో ఉంది సంజీవని. అది పట్టుకొచ్చాడు గనుక ద్రోణాద్రి హారకః. పైగా మేరు పర్వత సమీపంలోనే స్వామిని ఉపాసన చేసి హనుమద్దర్శనం పొందారు కొందరు మహర్షులు. అందుకు మేరు పీఠకార్చనకారకః. దక్షిణాసా భాస్కరః అంటే - దక్షిణదిక్కునుంచి ఆకాశంలో ఎగిరాడాయన. అప్పుడు దక్షిణాసా భాస్కరునిగా గోచరిస్తున్నాడు. సర్వవిఘ్న వినాశకః - ఇలా మొత్తం ఎనిమిది నామములు. వీటిని జపించేటప్పుడు ఒక ప్రక్రియ చెప్పింది శాస్త్రం. ఒక పీటపై గానీ, లేదా రాగిపాత్రపై గానీ అష్టదళ పద్మాన్ని వేయమన్నారు. అది బియ్యపుపిండితోగానీ, పసుపుతోగానీ, కుంకుమతో గానీ, సింధూరంతో గానీ, ఏది సాధ్యమైతే అది. లేదా అన్ని కలిపినా ఫరవాలేదు. అష్టదళ పద్మం వేసి ఒక్కొక్క దళంలో ఒక్కొక్క నామం వ్రాయమని చెప్పారు. ఇదొక ప్రక్రియ. ఎనిమిది దళాలలో ఎనిమిది నామాలు వ్రాసి అందులో హనుమత్ స్వామిని ధ్యానం చేసి దానికి షోడశోపచారములతో పూజ చేయమన్నారు. అదే హనుమత్ స్వరూపంగా. ఎలా ధ్యానించాలి అంటే
ఉద్యత్కోట్యర్క సంకాశం జగత్ప్రక్షోభ కారకమ్!
శ్రీరామాంఘ్రి ధ్యాననిష్ఠం సుగ్రీవ ప్రముఖార్చితమ్!
విత్రాశయం తం నాదేన రాక్షసాన్ మారుతిం భజే!! అనే శ్లోకాన్ని చదువుకోమన్నారు. ఇది ఎలా అంటే ఉదయిస్తున్న సూర్యకాంతితో సమానంగా ఉన్నవాడు, రామపాదాన్ని ధ్యానిస్తున్న భంగిమలో ఉన్నవాడు, ఆయనని ఆయన చుట్టూ సుగ్రీవాదులు ధ్యానిస్తున్నారట. ఆయన గర్జన చేస్తే రాక్షసులు కూడా భయపడతారు. అలాంటి స్వరూపాన్ని ధ్యానం చేసి ఈ నామాలని ఒక్కొక్కటి పలుకుతూ అర్చన చేయమన్నారు. అంటే
రామభక్తాయ నమః
మహాతేజసే నమః
కపిరాజాయ నమః అంటూ స్వామికి ఇష్టమైన కుసుమాలతోను, తులసి, బిల్వము మొదలైన దళాలతోను, తెల్ల జిల్లేడు పువ్వులు, మొదలైన వాటితోను, తమలపాకులతోను, సింధూరముతోను అర్చన చేయాలి. ఆ తరువాత
శ్రీమహా తేజసే మారుత నందనాయ నమః" - ఇది రోజుకి యాభై మాలలు జరపమన్నారు. మాలకి 108 అనుకుంటే 50 మాలలు గనుక చేస్తే అతి కొద్ది రోజులలో సర్వ రోగములనుంచీ బయటపడతారు అన్నారు. రోగి తనంత తాను చేసుకోలేకపోతే రోగి గోత్రనామాలతో ఆయనను ఉద్దేశించి చేస్తే అతి త్వరలో ఫలితమిస్తుంది. జపమంతా పూర్తి అయిన తర్వాత ఆ దళానికి నీరాజనమిచ్చి
"సంకటమోచన కృపానిధాన్ రక్షాకీ జై శ్రీ హనుమాన్" - జయధ్వానమిది. ఇది జపించితే రోగనాశనము, భూతప్రేతనాశనము జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పిన అంశం.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About