శంకరులు చెప్పిన అద్భుతమైన శ్లోకము

 శంకరులు చెప్పిన అద్భుతమైన శ్లోకము


ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనం

ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |

యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో

వసన్త్యస్మి న్మన్యే వలమథనవాటీవిటపినాం ||


స్త్రీస్వరూపముగా దేవతారాధన చేసినప్పుడు కేశాదిపర్యంతము చేస్తారు. అమ్మవారి తలను ముందు దర్శించి తరవాత పాదముల వరకు చెయ్యాలి. అది ఉపాసనా విధానము. ఇది చాలా అద్భుతమైన శ్లోకము. శంకరులు చెప్పిన ఈ శ్లోక అర్ధమును మానసికముగా మననము చేస్తే తెలియకుండానే అజ్ఞానపు చీకట్లు విచ్చి పోతాయి. 

‘ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనం’

అమ్మా ! నీ జుట్టు నల్లకలువల తండములా ఉన్నది అన్నారు. సహజమైన సుగంధములతో ఉండటము ఒక ఎత్తు. సువాసనలతో ఉండటమే కాకుండా నల్ల కలువల తండము ఎలా ఉంటుందో అలా ఒత్తుగా ఉండే జుట్టు కలిగి ఉండటము ఒక ఎత్తు. 

‘ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే’

రెండవ పాదములో ‘ఘన’ అని మొదలు పెట్టారు. ఆమె జుత్తు ఎందుకు తెల్లబడదు అంటే ఆవిడ కాలమునందు వచ్చి కాలము నందు తిరిగి కాలమునందు పడిపోయేదికాదు కాలము ఆవిడకి లొంగి  ఉంటుంది. కాలము నడిపే సూర్య చంద్రులు ఆవిడకి తాటంకములై ఉంటారు. అంటారు శంకరాచార్యులవారు. ధ్వాంతం అంటే చీకటి. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా  అంటూ మొదలు పెట్టారు. మిగిలిన విషయము చెప్పలేదు అంటే విశ్వాసము ఉన్నవాడే అలా చెపుతాడు. శంకరులు ‘తవశివే’ అంటారు. శివే అనగా తల్లీ మంగళప్రదురాలా ! శుభప్రదురాలా ! ఎవరిని చూసినంత మాత్రము చేత మంగళము కలుగుతుందో, నీ కేశపాశము జన్మరాహిత్యమునకు కారణము అవుతుంది. కృష్ణపరమాత్మను ఘనశ్యామం అంటున్నట్లుగా ‘ఘన’ అంటే మేఘము. నల్లని నీటితో ఉన్న మేఘములో ఒక విధమైన కాంతి, మెరుపు ఉంటుంది. అలా అమ్మవారి జుట్టు నల్లగా, వత్తుగా ఉంటుంది. ‘స్నిగ్ధ’ అనగా జల్లుకుని పోయి ఉండటము కాక కేశములు అంటుకుని ఉండటము సంస్కరింపబడి, దగ్గర దగ్గరగా దువ్వబడి ఉంటాయి. స్త్రీ కేశపాశము చల్లుకుని చివర ముడి లేకుండా ఉంటే ఉగ్రభూతములు ఆవహిస్తాయి పరమ అమంగళకరము అని గుర్తు. పెళ్ళిలో తలంబ్రాలు పోసుకునేటప్పుడు పురుషుడు నువ్వు ఎప్పుడూ జూట్టు విరబోసుకుని నాకు కనపడకుండా ఉండెదవు గాక అని అడుగుతాడు.

‘శ్లక్ష్ణం’ అనగా తిత్తులు, చిక్కులు లేకుండా ఉండటము. పరమ శివునకు మంగళము కనక తల్లి జుట్టు విషయములో ఎంతో జాగర్తగా ఉంటుంది.

‘చికుర నికురుంబం తవ శివే’

చికురములు అంటే వెంట్రుకలు. అవి ఎలా ఉన్నాయి అనగా జుట్టు వంక చూసినప్పుడు నల్లకలువల తండమును చూసినప్పుడు ఎంత అందముగా ఉంటుందో అమ్మవారి జుట్టు అంత అందముగా ఉన్నది అన్నారు. నల్లకలువకింద రేకుల యొక్క మొదటి భాగములోనీటి బిందువులు ఉంటాయి. నల్ల కలువ మొదట్లో ముఖము పెడితే ఆ నీటితనము వలన కళ్ళకు చల్లగా చాలా విశ్రాంతిగా ఉంటుంది అది నల్లకలువ లక్షణము. తెల్లకలువకు ఎర్రకలువకు అలా ఉండదు.

అప్పయ్య దీక్షితులవారు కొన్ని కొన్ని వస్తువులు మనప్రయత్నము లేకుండా మనసు లయము అయిపోవాలి అంటే వాటిని అనుభవించమని       అన్నారు. ఏనుగు అంకుశమునకు ఎలా లొంగిపోతుందో, జింక ఒక పాటకు ఎలా లొంగుతుందో అలా మూడు వస్తువులకు మనసు లొంగి పరబ్రహ్మము వైపు ధ్యానములో ఒరుగుతుంది. అవి అరవిరిసిన తామరపూలు ఉన్న కొలను దగ్గర కూర్చుని కళ్ళు కూడా ముయ్యనవసరము లేకుండా ధ్యానము చేస్తే మనసు తొందరగా లయమైపోతుంది. వీణానాదము వాయించడము వచ్చినా, వేణువు వాయించినా పలికించడము వచ్చినా అమ్మవారు పరమప్రీతి చెంది ప్రసన్నురాలు అవుతుంది. వీణ వాయించడము వచ్చినా, వాయిస్తున్నప్పుడు వినడము అలవాటు అయి ఈ మూడింటి మీద దృష్టి పెట్టడము అలవాటు అయితే మనోలయము అవుతుంది. పూర్ణచంద్రబింబము కూడా అటువంటిదే. అమ్మవారి జుట్టు నల్లకలువల తండములా ఉంటుంది అని శంకరులు చెప్పడములో అర్ధము ధ్యానము చెయ్యడము నేర్చుకుంటే మనసు అందులో లయమవుతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది