ఏడీ సర్కారు బడి పనికిరాదన్నోడు..?




ఏడీ సర్కారు బడి పనికిరాదన్నోడు..? 
ఏడీ తెలుగు మీడియం దండుగన్నోడు..?
ప్రతి సర్కారు బడిలో ఈయన కథను నోటీసు బోర్డులో అతికించాలి… 
ప్రతి పిల్లవాడికీ చెప్పి స్ఫూర్తిని నింపాలి… 

తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికీ ఈ కథ చెప్పి ఆత్మన్యూనతను తొలగించాలి… 
వారిలో పట్టుదలను, కసిని, జ్ఞానతృష్ణను పెంచాలి… 
ఎవరైతే సర్కారు బడిలో చదవడం దండుగ అంటాడో తనకు ఈ ఫోటో చూపించాలి… 
తెలుగు మీడియం పనికిరాదన్న ప్రతివాడినీ రోణంకిగోపాలకృష్ణ తెలుసా అనడగాలి… ఎందుకు..? ఎందుకు..? ‘ముచ్చట’ మనస్పూర్తిగా అభినందిస్తూ, ప్రశంసిస్తూ చెబుతున్న ఓ రియల్ సక్సెస్ స్టోరీ ఇది… కృత్రిమమైన విజయగాథలకు భిన్నంగా, చీత్కారాలు, ఎగతాళి వ్యాఖ్యల నడుమ సివిల్స్ థర్డ్ ర్యాంకును కొట్టేసిన ఈ సిక్కోలు మణిపూస కథ ఇది… ఎందుకంటే ఈ ర్యాంకు సాధన మనకు చాలా చాలా పాఠాలు చెబుతున్నది గనుక…!ఈయన పేరు రోణంకి గోపాలకృష్ణ… తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యవసాయ కూలీలు… నిరక్షరాస్యులు… ఊరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం, పారసంబ… వీథిబడిలోనే స్కూల్ చదువు… ఇంటర్ దాకా తెలుగు మీడియం… డిగ్రీ చేసింది ఆంధ్రా యూనివర్శిటీ దూరవిద్యలో… ప్రతిభకు కులం ఉండదు, పేదరికం ఉండదు, ప్రాంతం ఉండదు… మనిషిలో ఎదగాలనే కసి ఉండాలే గానీ ఏదీ అడ్డురాదు అని చెప్పేందుకు ఉదాహరణ తను… ఉపాధ్యాయ శిక్షణ పొందాక 2007లోనే టీచర్ అయ్యాడు… అదే మండలంలోని రేగులపాడులో సర్కారీ టీచర్… 2006 నుంచి సివిల్స్ కోసం పోరాటం… 2012లోనే గ్రూపు-1 ఇంటర్వ్యూల దాకా వెళ్లాడు… చివరకు గోల్ కొట్టాడు… అదీ జాతీయ స్థాయిలో థర్డ్ ర్యాంకు… అదీ అల్లాటప్పా కాదు… ఎలాగంటే..?ఓ సాదాసీదా కూలీ కుటుంబం… కాసింత పొలం… చదివింది తెలుగు మీడియం, సర్కారు బడి… పైగా డిగ్రీయేమో దూరవిద్య… వెనుకబడిన జిల్లా… ఇప్పటికీ తన ఊరికి న్యూస్ పేపర్ రాదు… తను సర్కారు బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు… గుడ్డి దీపాలే… తన సివిల్స్ కోరిక విని అడ్మిషన్స్ ఇవ్వటానికే నిరాకరించాయి హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లు… మొహం మీదే నవ్వి వెక్కిరించారు… వాటి నడుమ తనలో పట్టుదల మరింత పెరిగింది… ఏకంగా తెలుగులో మెయిన్స్, తెలుగు లిటరేచర్ ఆప్షనల్… తెలుగులో ఇంటర్వ్యూ… మొత్తం తెలుగే… చూడండి… ఎన్నిరకాల ప్రతికూలతలు, అయితేనేం… పదకొండేళ్ల ఆ పోరాటానికి చివరకు ఆ సివిల్స్ శిఖరం తనే వంగి సెల్యూట్ కొట్టింది…ఆ కుటుంబం సామాజికంగానూ ఇక్కట్లు పడింది… అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తండ్రి ఎవరో నిమ్నకులస్తుడి ఇంట్లో భోంచేసినందుకు చుట్టాలు, ఊరోళ్లు దాదాపు వెలివేశారు… ఎవరూ మాట్లాడరు… అదో శిక్ష… బాగా సాధనసంపత్తి ఉండి,విద్యావాతావరణంలోనే పెరిగి, అత్యుత్తమ కోచింగ్తీసుకుని సివిల్స్ కొట్టినవాళ్లు, ర్యాంకులు పొందినవాళ్లకన్నా ఇలాంటి వ్యక్తులు సాధించిన ర్యాంకులకే విలువ ఎక్కువ… ఎందుకంటే, ఈ ర్యాంకుకు కన్నీటి రుచి ఉంది… మట్టి వాసన ఉంది… చీత్కారాల రంగు ఉంది… అన్నింటికీమించి తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ, సర్కారు బళ్లుమూసేస్తున్న ఇప్పటి దుస్థితిలో ప్రతి సర్కారు బడి విద్యార్థి, ప్రతి తెలుగు మీడియం విద్యార్థి తల ఎత్తుకుని చెప్పుకోగలిగేది ఈ కథ… అందుకే ఇదీ రియల్ సక్సెస్ స్టోరీ… కంగ్రాట్స్ గోపాలకృష్ణా…


శ్రీకాకుళం వాసికి మూడో ర్యాంకుతెలుగులో మెరిసిన ఆణిముత్యం

వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడు చిన్నతనం నుంచి అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగాడు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలనే సంకల్పంతో పగలూరాత్రీ తేడాలేకుండా కష్టపడి చదివాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి ఎట్టకేలకు తన కల నిజం చేసుకున్నాడు. తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంఘం ఆరో వార్డులోని పారసంబ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ తల్లిదండ్రులు అప్పారావు, రుక్మిణి ఇద్దరు వ్యవసాయ కూలీలే. వీరి కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని చిన్నతనంలోనే గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఆయన ప్రస్తుతం పలాసలోని రేగులపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జీవితంలో మరింత ఉన్నతస్థానానికి వెళ్లాలని, అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరికతో సివిల్స్‌కు సిద్ధమయ్యారు. మూడుసార్లు సివిల్స్‌లో విఫలమైనా పట్టువదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. పారసంబలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదువరకు గోపాలకృష్ణ విద్యాభ్యాసం కొనసాగింది. ఆరు నుంచి పది తరగతులు బ్రాహ్మణపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్‌ పలాసలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యావిధానం ద్వారా బీఎస్సీ పూర్తిచేశారు.2006 డీఎస్సీకి ఎంపికై ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. సివిల్స్‌లో తెలుగు లిటరేచర్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుని విజయంసాధించారు. తెలుగులో సివిల్స్‌రాసి విజయం సాధించడం అసాధ్యం అనే మాటను సుసాధ్యం చేశారు. తెలుగులోనే మెయిన్స్‌ రాసి, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే పూర్తి చేసి విజయం సాధించారు.

 

మేడమ్‌ లేచి నిలుచుని నమస్కరించారు : రోణంకి గోపాలకృష్ణ, మూడో ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆరో వార్డు పరసంబ మా స్వస్థలం. మాది పూర్తిగా గ్రామీణ కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. ఇంటర్‌ తరవాత డిస్టెన్స విధానంలో నేను చదువుకున్నాను. 2006 డిఎస్ సిలో ఎస్‌జిటి టీచర్‌గా ఎంపికై పనిచేస్తున్నాను. పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నాను. సివిల్స్‌లోనూ మెయిన్స్ తెలుగులోనే రాశాను. ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చేశాను. తెలుగు సాహిత్యం నా ఆప్షనల్‌ సబ్జెక్టు. నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు పొందాను. ఈ పర్యాయం సుజాతా మెహతా బోర్డ్‌ నన్ను ఇంటర్వ్యూ చేసింది. నా పేరెంట్స్‌తో మొదలుపెట్టి టీచింగ్‌పైనే ఎక్కువగా అడిగారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో అభ్యాసం చేసిన వారితో పోటీపడగలరా అని ప్రశ్నించారు. అందుకు సజీవ సాక్ష్యం నేనే అన్నప్పుడు బోర్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. చివర్లో ఒక దేశభక్తి గేయం పాడమన్నారు. శ్రావ్యంగా పాడటంతో మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూ పూర్తయిన తరవాత సుజాత మెహతా మేడమ్‌ లేచి నిలుచుని నాకు నమస్కారం చేస్తే ఆశ్చర్యపోవడం నా వంతైంది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది