ఓ కాలేజ్ లో జరిగిన ఉత్సవంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన జరిగిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఓ విద్యార్ధి స్వామి పరిపూర్ణానందపై ఓ ప్రశ్నను సంధించాడు.
'పూర్వకాలంలో విద్యుద్దీపాలు లేని రోజుల్లో, నూనె దీపాలు వెలిగించి, సభలు జరుపుకునేవారు.. కానీ ఇప్పుడు ఎంతో ఆధునికమైన, వైవిధ్యభరితమైన విద్యుద్దీపాలున్నాయి. ఈ విద్యుద్దీప కాంతులలో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. అయినా కూడా ఇక్కడ దీప ప్రజ్వలన చేశారు. మీరు కూడా దానిలో పాల్గొన్నారు. దీనిని ఏమనుకోవాలి? ఇది చాదస్తం కాదా..? ఇన్ని విద్యుద్దీపాల మధ్య ఈ జ్యోతి ప్రజ్వలన నిజంగా అవసరమంటారా? ' అని ప్రశ్నించాడు.
అందుకు స్వామీజీ ఇలా బదులిచ్చారు.
'దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఫ్లడ్ లైటుకి దగ్గరగా మరో బల్బు పెడితే దీనిని ఆ బల్బు వెలిగించలేదు. అదే, నూనె దీపాన్ని తీసుకోండి. ఒక్క దీపం వెలుగుతూ ఉంటే చాలు. దాని దగ్గరకు చేరిన దీపాలను ఒకటి, పది, వంద, వేలు, లక్షలు, కోట్లు ఇక మీ ఓపిక. ఒక్కదానితోనే ఎన్నింటినైనా వెలిగించవచ్చు. అందుకే, దీప ప్రజ్వలనలో ప్రకాశంతోపాటు, అది ఇచ్చే సందేశాన్ని కూడా స్వీకరించాలి. ఓ గురువు కూడా దీపం లాంటి వాడు. తాను ప్రకాశిస్తూ, తన వద్దకు చేరిన వారిని కూడా తనలాగే ప్రకాశింపజేస్తాడు. ఇదే మన భారతీయత.