రాజసూయయాగం_అనంతర_విశేషాలు






*రాజసూయయాగం_అనంతర_విశేషాలు*

ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ , ధృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు ద్రుపదుని సాగనంపారు. నకులుడు శల్యుని, సుబలుని సాగనంపాడు. సహదేవుడు ద్రోణ, కృప అశ్వత్థామ లను సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద శెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. 

మయసభా విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డారు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి " సుయోధనా నీకు ఏమైంది? " అని అడిగాడు. దుర్యోధనుడు " మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్ట వంతుడు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐస్వైర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా ? " అని దుఃఖించాడు. శకుని " సుయోధనా ! ధృతరాష్ట్రుని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను " అన్నాడు.

*మాయా జూదానికి-నాంది*

దుర్యోధనుడు శకునినితో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చింతించాడు. " నాయనా సుయోధనా ! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు ? " అని అడిగాడు. " తండ్రీ ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోలచడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు. ధర్మరాజుకు సాత్యకి ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను " అన్నాడు. శకుని దుర్యోధనునితో " ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలియని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను " అన్నాడు. సుయోధనుడు సంతోషించి " తండ్రీ ! ఇందుకు మీరు అంగీకరించండి " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము " అని అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను మీరు విదురుడు సంతోషంగా ఉండండి " అన్నాడు. జూదం తగదని సంశయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు " ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా ! నీవు అనవసరంగా అనుమాన పడవద్దు. మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా " అన్నాడు. ధృతరాష్ట్రుడు " దుర్యోధనా ! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. మీ రిద్దరూ రాజ్యాన్ని పాలించండి " అన్నాడు. దుర్యోధనుడు " మహారాజా ! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు " అన్నాడు. వెంటనే శకుని " సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగా పాండవులను జయించడం ఎవరి తరం కాదు " అన్నాడు. దృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. " మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు.నేను అతని మాట మీరను జూదం వదిలి ఎప్పటిలా ఉండు " అని దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకునితో జూదం ఆడ్టానికి అనుమతి ఇవ్వండి " అన్నాడు.

*జూదానికి ఆహ్వానం*

తప్పని సరి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా! మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకుని రా. పొద్దు పోవడానికి దుర్వోధనునితో జూదం ఆడుతాడు " అన్నాడు. విదురుడు జూదం అనర్ధమని ఎన్ని మార్లు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. ఇక తప్పదని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ధర్మరాజు విదురుని సాదరంగా ఆహ్వానించాడు. విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో " విదురా ! మా పెదనాన ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము . సభను చూస్తాము కానీ జూదం తగునా జూదం వలన విభేదాలు వస్తాయి. అయినా దృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధార్యము . అందుకని మీతో వస్తాము " అన్నాడు. హస్థినాపురంలో కుమారులతోను భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు , శకుని, అశ్వత్థామ, సైంధవుడు మొదలైనవారితో ఉన్న దృతరాష్ట్రుడికి, భానునుమతి మొదలైన కోడళ్ళతో ఉన్న గాంధారి కి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్ళకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు. దుర్యోధనునితో కలసి పాడవులు సభను తిలకించి సుఖానుశీనులైనారు.





*జూదం-ప్రారంభం*

ధర్మరాజు జూదంలో ఓడిపోవుట

ఆ సమయంలో దుర్యోధనుడు " ధర్మజా! కొంచెం సేపు జూదం ఆడతాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! జూదం అందులో మోసపూరిత జూదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలులతో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు. ధర్మ జూదంలో గెలవడం పుణ్యం, కపట జూదంలో గెలవడం పాపం " అన్నాడు. శకుని " జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలినవారు జూదాన్ని నిందించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా. నీకు భయమైతే వద్దు " అన్నాడు. ధర్మరాజు " బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఆడక తప్పుతుందా. ఇక మాటలెందుకు కానివ్వండి " అన్నాడు. ధర్మరాజు " మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు " అని అడిగాడు. దుర్యోధనుడు " ధర్మజా! నా తరఫున శకుని జూదం ఆడతాడు అతడు ఓడిన ధనరాశులు నీవి " అన్నాడు. ధర్మరాజు " ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం " అనుకున్నాడు. చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికల మనస్కులై చూస్తున్నారు. శకుని తనకోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజు లో పంతం పెరిగింది. ఒకటి తరువాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు. బంగారు బండాగారాలు, వజ్రాల బండాగారాలు, రత్నబండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసీ జనాలు, గూవులు, సేనావాహిని, అన్నింటినీ ఓడి పోయాడు. ఇది చూసి విదురుడు దృతరాష్ట్రునితో " దుర్యోధనుడు పాపాత్ముడు కురు వంశం పాపంతో నిండపోతుంది. దుర్యోధనుని నివారించు. ధర్మాన్ని రక్షించు. వినాశనాన్ని ఆపించు. దుర్యోధనుని బహిష్కరించు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు ఉపేక్షించకు " అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో " సుయోధనా ! నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు ఛీ కొట్టరా ? ఇలా మోసం చెయ్యటం మంచిదా " అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో " నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విష సర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం. కనుక మాకు బుద్ధులు చెప్పద్దు " అని దూషించాడు. శకుని ధర్మరాజు తో " ధర్మజా! నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తరువాత పందెం ఏమిటి " అన్నాడు. అప్పటికే ధర్మరాజు జూదానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను ఒడ్డి ఓడిపోయాడు. తన తమ్ములను ఒడ్డి ఓడిపోయాడు ఆఖరున తనను తాను ఓడ్డుకున్నాడు. అప్పుడు శకుని " ధర్మజా ! అదేమిటి నిన్ను నీవు ఒడ్డుకున్నావు. నీ వద్ద ఒడ్డడానికి మరొక ధనం ఉంది మరిచి పోయావా ? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా?" అని ఎత్తి పొడిచాడు. అప్పుడు పాచికలు అందుకున్న ధర్మరాజు ద్రౌపది ని ఫణంగా పెట్టి ఓడి పోయాడు. అప్పుడు ఆట చాలించాడు.

*ద్రౌపదికి_సభలో_అవమానం*

ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాటరాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. " విదురా! ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు?" అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి " నా ఇల్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా " అని ఆజ్ఞాపించాడు. విదురుడు " ఛీ నీవంటి మూర్ఖుడు లేడు. ఇలాంటి పనికి నన్ను పంపుతారా. ద్రౌపది ఎవరు ? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా ! " అని అడిగాడు. సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి " నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొని రా " అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి " అమ్మా ! ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము " అన్నాడు. అప్పుడు ద్రౌపది " అయ్యా! ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ? ధర్మరాజు ఇలా చేసాడా? తనను కూడా ఓడాడు అంటున్నావు. తన్నోడి నన్నోడెనా ? నన్నోడి తన్నోడెనా ? తెలుసుకుని వచ్చి నన్ను తీసుకు పో " అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు. " ఇది సమాధానం చెప్ప వీలులేని విషయం. ఇక్కడికే వచ్చి అడగమను. నీవుపోయి ద్రౌపదిని తీసుకు రా " అని పంపాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి " అమ్మా! నీవు అడిగిన విషయం తెలుసుకోవడానికి నిన్ను అక్కడికి రమ్మన్నారు " అన్నాడు. చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది. దృతరాష్ట్రుని పక్కన నిలబడింది. ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాశనుని చూసి " నీవు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకు రా " అన్నాడు. ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది. దుశ్శాసనుడు ద్రౌపదితో ఎక్కడికి పోతావు నిన్ను శకుని జూదంలో గెలిచాడు. నువ్వు దుర్యోదనుని సొత్తు అయినావు " అంటూ దగ్గరికి వచ్చాడు. " అయ్యా నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టవద్దు. సభకు రాలేను " అన్నది. దుశ్శాసనుడు నవ్వి " ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు. నేను నిన్ను తీసుకు పోతాను " అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకు వచ్చాడు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి " అయ్యా! దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వచ్చాడు. మీరందరూ చూస్తుండగా అవమానించాడు. అధర్మం పెరిగి పోయింది " అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుని ధ్యానించింది. భీముడు ధర్మరాజుని చూసి " ఓ ధర్మజా! ఈ రాజ్యం, నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జూదంలో ఒడ్డావు. దృపదరాజ పుత్రిని జూదంలో పెట్టడం తగునా ? అందు వలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జూదమని తెలిసి నువ్వు జూదం ఆడావు. నీ చెయ్యి కాల్చాలి కదా " అర్జునుడు " అన్నయ్యా ! స్నేహంగా ఆడుకునే జూదానికి , ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కాని విధి వైపరీత్యానికి ఏమి చేస్తాం ? " అన్నాడు





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది