భక్తి ఉంటేనే విలువ

భక్తి ఉంటేనే విలువ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరి నామస్మరణ చేస్తూ.. ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా.. భగవానుడిపై ఆపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్య మంగళ స్వరూపం చూసి.. తన్మయంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా.. ఒక అరటి పండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి.. పండు పడవేసి... భక్తి పారవశ్యంలో.. తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్త వత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకుని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి.. ప్రతి రోజూ ఒక డజను అరటిపళ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. బాధతో.. ‘తండ్రి! అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనం ఇవ్వమ’ని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటి పళ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకుని తొక్క పడవేసి.. పండు స్వామికి అందించాడు. కానీ, విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో.. ‘నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి! గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా! ఇప్పుడు ఇలా కినుక వహించారేమిటి?’ అని ప్రశ్నించాడు.

విష్ణుమూర్తి చిన్నగా నవ్వి.. ‘నాయనా! ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి.. తొక్క నివేదించినా స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా.. భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను’ అని సమాధానమిచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయింది. భక్తి కలిగినపుడే కదా దేనికైనా విలువ అనుకుని.. నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది