శ్రీ విష్ణు పురాణము
🌸🌸🌸🌺🌺🌼🌼🌸🌸🌸
Part30
మోక్షం కోసం పశువుల్ని చంపడం హింస అనిపించుకుంటుందంటూ అహింసా సిద్ధాంతం అనే పేరిట యజ్ఞయాగాదులను మానిపించాడు. జగత్తంతా ఆధారశూన్యమనీ - అనురాగ మమకారాలు, సంసారంలో పడిమోహంలో కొట్టుకొనేలా చేస్తున్నాయనీ - నిజధర్మాల్ని రాక్షసులు విడిచిపెట్టేలా చేశాడు.
నానావిధాల ఈ బోధలు తలకెక్కి, మాయామోహితుడు చూపించిన దృష్టాంతాలతో మరింత చెలరేగి దానవులంతా క్రమక్రమంగా (ఒకర్ని చూసి ఒకరు, ఒకరి వల్ల విని మరొకరు) శ్రుతి - స్మృతి - బోధితధర్మాలను వదిలేశారు. లోకాయత, చార్వాక వేదబాహ్యమతాలను బోధించి వారందర్నీ ధర్మవిముఖులుగా మార్చడం మాత్రమే గాక వేదనిందకులుగా చేశాడు.
అత్యంత త్వరితంగా వారందరూ వేదనింద - బ్రాహ్మణ నింద మొదలైన ఘోరపాపాల పాల్ప్డటమే కాగ, శుష్కవాదాలు చేయడం ప్రారంభించారు.
"అగ్నిచేత దగ్ధములైన హవిస్సుల ఫల దాయకమా? ఇది అసలు నమ్మదగిన మాటేనా? ఎన్నెన్నో యజ్ఞాలు చేసినందువల్ల ఇంద్రపదవిని పొందిన ఇంద్రుడు, మనం చేసే హోమంలోని పుల్లా - పుడకా కర్రా - కంపా తినడం ఏం బాగుంది? అంతకంటే ఆకులలములు మేసేమేకలు నయంకాదూ? యజ్ఞంకోసం వధించబడే పశువుకు స్వర్గలోకప్రాప్తి అనేది నిజమే అయితే - దానికి బదులుగా యాగకర్త తన తండ్రినే బలిపశువుగా చేసి యాగంలో అతనికి ముక్తి ప్రసాదిస్తే మరింత యుక్తి యుక్తంగా ఉంటుంది కదా!
ఇహలోకంలో ఒకడు భుజించిన అన్నంవల్ల ఎక్కడో అంతరిక్షానికి అవతల ఉన్న పితృదేవుళ్ళు తరిస్తారంటూ శ్రాద్ధాదులు పెట్టే ఈ వేదాచారపరాయణులు పిచ్చివారిలా ఉన్నారే! ఇవన్నీ కేవలం ఈ ప్రాకృతజనుల నమ్మకాలు. అంతే ఇలా శుష్కతర్కాలతో రాక్షసులంతా ఒకర్నొకరు సమాధానపచుకుని మాయామోహుని బోధలు బాగా తలకెక్కించుకున్నారు. ఇల్లాంటి ఆచారవ్యవహారాత్మక కర్మకాండపట్ల ఉదాశీనత వహించడం ప్రారంభించారు.
మాయామోహుడు ఇంకొక దృష్టాంతం కూడా వారికి నచ్చేల చెప్పడంలో కృతకృత్యుడయ్యాడు. "వేదాలు అపౌరుషేయాలన్నారు. సరే! అలాగే అనుకుందాం! అవి ఆప్తవాక్యాలన్నారు. ఆప్తవాక్యాలనేవి ఆకాశం నుంచి వాటంతట అవే భూమ్మీద పడతాయా? దగ్గరగా వచ్చి ఆత్మీయంగా చెప్పే నాబోటి వారి వల్ల మీకు అందేవే అప్తవాక్యాలు అవుతాయి" అంటు నమ్మబలికాడు. ఏది చెప్పినా యుక్తియుక్తంగా ఉండాలి గాని, అతిశయోక్తులుగా ఉండరాదన్నాడు.
మాయామోహుని ప్రభావం దానవులంతా వేదాలపట్ల కక్షను నిర్లక్ష్యభావాన్ని పెంచుకున్నారు. దాంతో అధర్మం పెచ్చరిల్లింది. ఎప్పుడైతే వారు వేద దూరులైనారో క్రమక్రమంగా వారి బల శౌర్యవీర్య తేజ శ్శక్తులన్నీ హరించుకుపో నారంభించాయి.
అ అదనుకనిపెట్టి, దేవతలు రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ పెనుప్రయత్నంలో ధర్మమే రక్షించబడింది. సన్మార్గ విరోధము చేత దానవులంతా హతులయ్యారు. ఆ దానవులకు అంతకుపూర్వం స్వధర్మాచరణమే రక్షాకవచంగా ఉండేది. విష్ణుప్రేరేపిత విష్ణ్వాంశ నగ్నుడు, ముండితశిరస్కుడు మాయామోహితుని బోధనలు, దానవుల ధర్మనిరతికి నష్టం కలిగించడమే లక్ష్యంగా సాగడంతో వారు అసమర్థులైనారు.
మైత్రేయా! ఆ(నగ్న) మార్గగాములంతా వేదమనే కవచాన్ని వీడినవారై దేవతలచేత ఓడింపబడ్డారు. నానావిధాలుగా వేదనింద చేసినందుకు ఫలితం అనుభవించారు.
బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, పరివ్రాజాశ్రమం అని నాలుగే విధాలున్నాయి. అయిదవదనేది లేనేలేదు. గృహస్థాశ్రమాన్ని వీడితేగాని వానవ్రస్థాశ్రం లేదా పరివ్రాజాశ్రమం సిద్ధించదు. నగ్నధర్మావలంబనం పాపహేతువు.
శక్తి ఉండీ ఒక్కరోజు కర్మలోపం జరిపినా, అదిపాపహేతువే! ప్రాయశ్చిత్తంతో అతడు పరిశుద్ధుడు కాగల్గుతాడు. సూర్యుని దర్శించడం ద్వారా కొంతపాపప్రక్షాళన జరుగుతుంది. ఆరాధన వల్ల మరికొంత పాపం తొలగుతుంది. ఎవరి ఇల్లు దేవశూన్యమో, వానికి నిష్కృతి లేదు. అతడితో కలిసి సంచరించినా పాపమే!
బ్రాహ్మణాది 4 వర్ణాలవారు స్వధర్మాన్ని విడిచి హీనకర్మలు ఆచరిస్తే వారు నగ్నులనబడతారు. పంచమహాయజ్ఞాలు (ఋషి, దేవ, పితృ, అతిథి, భూతములను సంతృప్తిపరచుట) ఆచరించని వానితో మాట్లాడటమూ నరకహేతువే! కనుక ప్రాజ్ఞుడు నగ్నులను దూరం ఉంచాలి. వారిచే చూడబడిన శ్రాద్ధం అయినా పితృదేవతలకు ప్రీతి కరంకాదు.