సౌభరి వృత్తాంతము -శ్రీ విష్ణు పురాణము
🌼🌼🌼🌸🌸🌺🌺🌼🌼🌼
Part 27
ఇంద్రుడినే వాహనంగా చేసుకున్న నరాధిపతి:
విష్ణ్వాజ్ఞ ప్రకారం దేవతలంతా పురంజయుని వద్దకు వచ్చి "ఓ క్షత్రియ వీర శిఖామణీ! మేము నీ సహాయం కోరివచ్చినాము" అని విషయంతో విశదపరచగా, "దాని కేంభాగ్యం? మీ రాజైన ఇంద్రుడిని, తన మూపుపై నన్ను కూర్చోనిచ్చే విధంగా ఒప్పించండి. తప్పక నేను మీకు ప్రీతికరమైన పోరు సల్పి రాక్షసులనుంచి రక్షిస్తాను" అని చెప్పగా, ఆ ప్రతిపాదనకు దేవతలు అంగీకరించారు.
అప్పుడు ఇంద్రుడు ఎద్దురూపం ధరించగా, విష్ణుతేజః ప్రభావం చేత పురంజయుడు అమిత తేజస్సుతో వెలుగొందుతూ ఆ వృషభరూపుడైన ఇంద్రుని మూపుపై అధిరోహించి, ఘోర సంగ్రామంలో రాక్షసులని పారద్రోలాడు. ఎద్దు మూపునందు (కకుత్) స్థుతుడైనట్టి పురంజయుడికి కాకుత్థ్సుడు అనే పేరు సార్థకమైంది. ఇది పౌరుషనామం.
తర్వాత ఈతని వంశం (చంద్రవంశం) విస్తరించింది వరుసగా అనేనసుడు, పృధువు, విష్ణరాశ్వుడు, యువనాశ్వుడు, శావస్తుడు (శావస్తిపుర నిర్మాత), బౄహదశ్వుడు, కువలయాశ్వుడు వంటి ప్రముఖులతో విరాజిల్లింది.
కువలయాశ్వుడు విష్ణుతేజ స్సంయుతుడై తన 21000 మంది పుత్రులతో కూడ (సైన్యంతో నిమిత్తం లేకుండా) ఉదంకమహర్షిని బాధలు పెడుతూన్న దుందు రాక్షసుని సంహరించి దుందుమారుడని పేరొందిన వాడైనాడు. కాని దుందువు వదలిన తీవ్ర నిశ్వాస జ్వాలలలో ఇతని పుత్రులలో ముగ్గురు మాత్రం మిగిలి, అందరూ నశించారు. దృఢాశ్వ - కపిలాశ్వ - చండాశ్వులు వీరు.
వీరిలో దృఢాశ్వునికి హర్యశ్వుడు, నికుంభుడు, అమితాశ్వుడు, కృశాశ్వుడు, ప్రసేన జిత్, యువనాశ్వుడు, ఈ రీతిగా పుత్రులు జనించి వంశ విస్తరణ సాగింది.
యువనాశ్వునికి పుత్రసంతానం కోసం మునులు పుత్రకామేష్ఠి జరిపించి, ఒకనాటి రేయి మంత్రపూరితమైన జలాన్ని నింపిన కలశం, ఆ యజ్ఞవాటికలోనే ఉంచి అందరూ నిద్రపోయారు.
నిజానికి ఆ జలాన్ని యువనాశ్వుని పత్ని నిమిత్తం అక్కడ ఉంచారామునులు. యాగశాలలోనే భూశయనాది నియమాల ప్రకారం నిద్రిస్తూ వున్న యువనాశ్వునికి అదే రేయి దప్పిక తీర్చుకోడానికి ఆజలమే ఆధారమైంది. అది మంత్రపూరిత జలమని, దాన్ని తాగితే గర్భం వస్తుందని అతడికి తెలీదు. యువనశ్వుడీ జలాన్ని గ్రహించడం చేత, వాస్తవానికి అతని పత్ని కడుపున పెరగవలసిన శిశువు అతని గర్భంలోనే పెరగసాగాడు. పూర్తిగా పెరిగాక కుడిచేతి బొటనవ్రేలితో గర్భాన్ని చీల్చుకొని బైటకొచ్చిన ఆ శిశువుకు పాలుచీకే స్థితి లేకపోయినందున - ఇంద్రుడు తన వ్రేలిని ఆ శిశువునోట ఉంచి 'మంధాన్యాతి' అన్నాడు. అదే ఆ శిశువుకు అమృతమై - మాంధాత అనే పేరే సార్థకమై అతడు సప్తద్వీపాధిపతి అయ్యాడు. మాంధాత చక్రవర్తి కీర్తి విశ్వవ్యాప్తమైంది.
సౌభరి వృత్తాంతము :
ఇతడు శశిబిందు తనయ అయిన ఇందుమతిని పరిణయమాడాడు. వారిక అంబరీషుడు, పురుకుత్సుడు, ముచుకుందుడు కలుగారు. వీరుగాక 150 మంది కుమార్తెలు దయించారు.
ఋగ్వేద శాఖీయుడైన బహ్మృచుడనబడే సౌభరిముని జలాల్లోపల పన్నెండేళ్లపాటు తపస్సుచేస్కుంటూండగా - సంమదుడనే మత్స్యరాజు తన పుత్రపౌత్రాదులతో నిత్యము ఆ సౌభరికి కన్నులవిందు చేయగా, అతడు తపోదీక్షనుంచి మనస్సు మరలించుకొని తాను కూడా పుత్రపౌత్రసుఖంకోరి మాంధాతృచక్రవర్తి వద్దకు వెళ్లాడు.
ఆ చక్రవర్తి సౌభరి మునిని సముచితరీతిన గౌరవించి, ఆ మునివరేణ్యుని రాకకు కారణం అడిగాడు. కన్యనిమ్మన్నాడు సౌభరిముని. ఇతర రాజులకంటే గొప్పవాడైన మాంధాతృవంతటివాడు ఈ విషయంలో కొంచెం వెనుక ముందు అయి తటపటాయించసాగాడు.
సౌభరి వంటి జడధారికి తన పుత్రికను ఇవ్వజాలనొల్లక, తాపసోత్తములతో తగవుపడనొల్లక ఒక ఉపాయం అలోచించాడా చక్రవర్తి.
జడధారిని ఇష్టపడే కన్యలు సాధారణంగా ఉండరు కనుక, "మహర్షీ! మేము మా కన్య్లల కిష్టుడైన వానినే పెళ్ళి చేయగలవారము. అనిష్టపూర్వకంగా జరిగే వివాహం సుఖకరం కాదన్న విషయం మీకు తెలిసిందేకద" అంటూ దాటవేయబోయాడు.
"చక్రవర్తీ! నీకు ఇంతమంది కూతుళ్లున్నారు. ఎవరికో ఇచ్చి ఏనాటికైనా వారిని కట్టబెట్టక తప్పదు కదా! అదీగాక ఒక్కో స్త్రీ హృదయం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. అంతమంది కన్యలలో నేను ఎవరికైనా నచ్చుతానేమో! కనుక నీ అంతఃపురంలోనికి ప్రవేశించడానికి అనుమతించు! చాలు!" అన్నాడు.
ముని శాపభయం చేత ఆ చక్రవర్తి ఏదోలా ధైర్యం చిక్కబట్టుకుని సరే అన్నాడు. "రూపం మార్చడం" ఆ తాపసికి గల సిద్ధశక్తులకొక లెక్కా? క్షణాల్లో గంధర్వుల్ని తలదన్నే సుందరరూపంతో ప్రకాశించసాగాడా సౌభరి. అంతఃపురంలోనికి వెళ్లాక, ఆ మహర్షి రూపాన్ని చూసి మోహించని మాంధాతృపుత్రిక లేదు. అందరూ పోటీపడ్డారు. ఎలాంటి అరమరికలు లేకుండా వారు అందరూ ఆ సౌభరిని ఇష్టపడ్డారు.
ఇక చేసేది లేక, మాంధాతృచక్రవర్తి తన కూతుళ్లనందరినీ ఈ మునిపరం చేశాడు. అతడు వారినందరినీ ఏదో మాయచేసి అకర్షించాడని లోలోపల ఆ చక్రవర్తికి పీకుతూనే ఉన్నా, అలాచేయక తప్పింది కాదు.
అయితే మహానుభావుడైన ఆ మునీశ్వరుడు మాయావికాడు. గనుక తన తపోబలం చేత దేవతలశిల్పి విశ్వకర్మను రప్పించి రాజోచితమైన దివ్య రమణియమైన అంతఃపురాల్ని నిర్మించవలసిందని ఆదేశించాడు.
ఆ దేవశిల్పి ఆ ప్రకారమే రమణికొకటి చొప్పున దివ్యభవనాలను సకల సదుపాయాలతో కల్పించాడు. ఇదంతా తెలీని మాంధాతృచక్రవర్తికి తన కూతుళ్ల మీద నానాటికీ దిగులు అధికం కాసాగింది. ఎలా ఉన్నారో చూసి వద్దామని, ఆముని ఆశ్రమానికి బయలుదేరాడు.
అశ్చర్యకరంగా అతనికి చక్కని రాజభవనాలు, సకలసౌఖ్యాల్తో దర్శనమివ్వడమే గాక, ప్రతి కూతురూ కూడా తమనాధుడు తనను విడిచి ఎక్కడికీ కదలనే కదలడని చెప్పడం అ చక్రవర్తికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
సౌభరి ముని అణిమాది సిద్ధి వశాన ఈ వైభవమంతా సంప్రాప్తించిందని, తన కూతుళ్లకిక ఎట్టి కొరత ఉండదని గ్రహించుకున్న చక్రవర్తి సంతుష్టంత రంగుడై తన అల్లుని ప్రశంసించి రాజధానికి మరలివచ్చాడు.
ఆ మహర్షి వల్ల వారికి పుత్రులుదయించారు. వారు క్రమంగా పెరిగి పెద్దవారౌతూండగా చూస్తూన్న సౌభరి ముని ఒకనాడు తనలోతాను ఇలా తర్కించుకోసాగాడు...
"వీళ్లంతా పెరిగిపెద్దవారౌతారు. వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి. వారికి పిల్లలు పుడతారు. ఇలాగే పుత్రపౌత్ర ప్రవర్థమానంగా సాగే ఈ వంశపరంపరనంతటినీ కళ్లారా చూడాలన్న కోరిక అనంతంగా సాగిపోతూంటుంది. దీనికి అంతం అనేది లేదు. ఆ తర్వాత ఇంకో కోరిక పుడుతుంది. అదీ తీరుతుంది ఆపైన ఇంకో కోరిక...అదీ తీరాక ఇంకొకటిజనిస్తుంది. నీటిలో కొంతకాలం చేపలస్నేహం చేత కదా నాకీచాపల్యం కలిగింది. ఇంతమందితో సుఖించడం, వీరి పుట్టుకకు కారకుడిని కావడం...ఏమిటిదంతా? నా తపస్సమాధి ఏమైంది? నా నిష్ఠ ఇలాపెడదారి పట్టిందే! మమకారం మోజులో పడ్డానేం? అయ్యయ్యో! యతులకు నిస్సంగత్యం - నిర్మోహత్వం ముక్తి స్థానాలంటారే! ఇది తెలిసీ నేను ఆచరించినదేమిటి? ఇప్పటికయినా ఈ సంసార దుఃఖాన్ని విడిచి విష్ణువును సేవించెదగాక" అని గట్టిగా నిర్ణయించుకొని....
సమస్త భూతా దమలా దనంతాత్స ర్వేశ్వరా దన్యదనాది మధ్యాత్ |
యస్మాన్నకించిత్త మహంగురూణాం పరంగురుం సంశ్రేయమేమి విష్ణుం ||
అనుకున్నవాడై, విష్ణువును శరణం పొంది, వారందరినీ విడిచి సౌభరి ముని కోరి తాను పెండ్లాడినందున భార్యలందరినీ తీసుకుని అడవిలోనికి ప్రవేశించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. తదుపరి విష్ణువునందే లగ్నమానసుడై మోక్షగామికూడా అయ్యాడు.
ఇదీ మాంధాతృ పుత్రికలను పెండ్లాడిన సౌభరిముని చరిత్ర.
శ్లో|| ఇత్యే త న్మాంధాతృ దుహితృ సంబంధ్యా ఖ్యాతమ్ |
యశ్చైత త్సౌభరి చరిత మనుస్మరతి పఠతి పాఠయతి శృణోతి శ్రావయతి
అవధారయతి లిఖితి లేఖయతి శిక్షయతి...వాజ్మన సోరసనార్గను
సరణ మశేష హే యేషువా మమత్యం న భవతీతి ||
ఈ సౌభరిచరిత్ర చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా, రాసినా, రాయించినా, ఉపదేశించినా సన్మార్గ వర్తనం కలిగి, హేయపదార్థములపై మమకారం నశిస్తుంది.
సౌభరిచరిత్ర వినిపించిన తదుపరి, మైత్రేయునికి పరాశరమాహర్షి 'మాంధాత చక్రవర్తి సంతతిని - ఆ వంశ విస్తరణ క్రమాన్ని' ఇలా చెప్పసాగాడు...