రజకుని పట్ల ఆగ్రహం - మాలాకారునిపై అనుగ్రహం-శ్రీ విష్ణు పురాణము

రజకుని పట్ల ఆగ్రహం - మాలాకారునిపై అనుగ్రహం-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part11

అలా నడుస్తూన్న ఆ సోదరద్వయాన్ని మధురానగరి స్త్రీలు వేడుకగా చూడసాగారు. వారికి ఒక రజకుడు (చాకలి) రాజవస్త్రాలను తీసుకెళ్తూ కనిపించగా - ఆ వస్త్రాలిమ్మని అడిగారు వారు. 'ఇవి దివాణం వస్త్రాలు. మీ వంటి పల్లెటూరి ఆసాములకు తగినవి కావు' అంటూ వాడు హేళనచేయగా, వాని నొక్కగుద్దుగుద్ది ఆ వస్త్రాలు లాక్కున్నారు బలరామకృష్ణులు.

వీటిలో నీలవస్త్రం - పీతవస్త్రం ఎన్నిక చేసి ధరించి, ఆ రాచబాటలోనే ఉన్న ఒక పూలవాని ఇంటికి వెళ్లి దివ్యగంధాలు వెదజల్లే పుష్పహారాలను ఇమ్మని అడిగారు. అతడు లోపలకు వెళ్ళి అన్నిటికన్నా మేలైన పుష్పాలను భక్తితో వారికి కానుకగా సమర్పించగా, శ్రీకృష్ణుడు ప్రసన్నుడై "భద్రుడా! నీకు సిరిసంపదలు అపారంగా కలుగుగాక" అని అనుగ్రహించి ముందుకు సాగిపోయాడు.

ఇంతలో ఒక సుగంధపాత్రతో ఒక మరుగుజ్జు (కుబ్జ) వారికి ఎదురురాగా, ఆమెను ప్రశ్నించి కంసునికి గంథం స్వయంగా తీసి సమర్పించే 'వక్ర' అనే దాసిగా దాన్ని తెలుసుకుని, 'ఈ గంథం మాకు కావలసి ఉంది' అనగా, అప్పటికే ఆ సోదరులచేత ఆకర్షించబడిన ఆ కబ్జ దానిని సభక్తియుతంగా వారికి సమర్పించింది. తన చేతితో ఆమెను స్పృశించి ఆ వికారరూపిణిని చక్కదనాల చుక్కగా మలచి, ఆమె సమర్పించిన గంథాదులు అలదికొని అక్కడి నుంచి నిష్క్రమించారు.

దారిలో కంసుని ధనుశ్శాలలోనికి చొరబడి, అక్కడున్న ఆయుధాల నాణ్యత పరీక్షిస్తూంటే, కొన్ని ధనువులు విరిగి మధురానగరమంతా వినిపించేంత సందడికాగా, అక్కడున్న కావలివారు ఆ సోదరుల్ని నిరోధింపజూసి నిశ్శేషంగా హతులయ్యారు. కంసునికీ వార్తచేరి, గోపబాలురిద్దరూ వచ్చినట్లు తెలుసుకుని వెంటనే సభాద్వారాన 'కువలయాపీడం' అనే ఏనుగును నిల్పి ఉంచాడు.

చాణూరుని - ముష్టికుని రప్పించి "మహామల్లయోధులైన మీరు ఇప్పుడు పైకి సామాన్యంగా కనిపించే ఇద్దరు గోపబాలురతో ద్వంద్వయుద్ధానికి తలపడాలి. ఇది ఆజ్ఞకాదు! మీ బాహు బలానికి పరీక్ష. మనం గెలిచామా!...మీకు నాతో సమానంగా రాచభోగాలు అందుతాయి. అసలు ఆ పరిస్థితే రాకపోవచ్చు నేమో! మన మదపు టేనుగు ధాటికి ఎరగాకుండా వాళ్ళు బతికినప్పుడు గదా - మీతో యుద్ధం చేయడం" అంటూనే గోపాలురనిద్దరినీ అక్కడ ప్రవేశపెట్టమన్నాడు కంసుడు. సోదరులిరువురు ఆ ద్వారాన్ని సమీపించారు.

వారు అక్కడకు చేరుకుంటూండగానే, మావటిచేత ప్రేరేపించబడిన ఆ మదగజం భయంకరంగా ఘీంకారాలు చేస్తూ గోపకుమారులమీదకి రాసాగింది. వాసుదేవుడా ఏనుగు తొండాన్ని పట్టుకుని బాల్యచేష్టచేత కొంతసేపు దాంతో ఆడుకుని, అటూ ఇటూ ఊపాడు. తన కుడిచేత్తో దాని ఎడమదంతాన్ని పీకి మావటిపైకి ప్రయోగించగా, ఈలోగా బలరాముడు కుడిదంతం పనిపట్టాడు. రెండువైపులా దాన్ని కాస్తూన్న గజపాలులను ఆ దంతంతో నెట్టాడు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తూండగా, కేవలం తన ఎడమ పాదంతోనే ఆ ఏనుగు కుంభస్థలాన్ని అదిమి, దాని మందం - రక్తం ఒంటిమీద - 'పూత' గా పడగా రంగంలోకి ప్రవేశించారు.

స్వయంగా ఆ సోదరుల ప్రతాపాన్ని ప్రత్యక్షంగా అక్కడ చూసిన మధురాపురి జనులు, అంతవరకు కృష్ణునిచే చంపబడిన రాక్షసులను గురించి ఒకరికి తెలిసినవి మరొకరు ముచ్చటగా చెప్పుకున్నారు. వారిద్దర్నీ మార్చిమార్చి ఆరాధనగా చూస్తూ, "ఈ గోపబాలురలో ఎంత తేజం - ఎంత శక్తి దాగివుంది? భూభారాన్ని హరింపవచ్చిన హరి అవతారమితడు అచ్యుతుడు కదా! ఆ పక్కన అంశావతారముర్తి బలరాముడు. తమ్మునికి తగ్గ అన్న" అనుకుంటున్నారు వారు. ఆ జనం మధ్యలో తానూ ఒకడై, కృష్ణుని కన్నతండ్రి ఆనందబాష్పాలు రాలుస్తూ తన జన్మ ధన్యమైందని భావించాడు. అతడే వసుదేవుడు.

కర్కశదేహులు, కరాళకరములవారు అయిన చాణూరుని ముష్టుకునితో ఈ యుద్ధం ఆ సుకుమార దేహులకెలా సంఘటిల్లింది? ఈ ఏర్పాటులో ఏదో కుతంత్రం ఉన్నట్లు తోస్తోంది. అయ్యయ్యో! ఇది తగదని, దీన్ని నివారించగల పెద్దలు లేరా?' అని సుకుమారీమణులైన కొందరు అంతఃపుర కన్యలు శ్రీకృష్ణుని అందాన్ని కళ్లతోనే తనివితీరా గ్రోలుతూ నిట్టూరుస్తున్నారు.

కృష్ణుడు చాణూరునితోను - బలరాముడు ముష్టికునితోనూ తలపడ్డారు. మల్లయుద్ధశాస్త్రంలో బాహుయుద్ధగతి విశేషాలు (ఆయువుపట్లవంటివి) తెలిసి ప్రయోగించడంలో నిపుణులే ఒక్కొక్కసారి తత్తరపడతారు. అటువంటిది, ఈ కిశోరప్రాయులు అద్భుత నైపుణ్యం కనపరుస్తూ, అవలీలగా చాణూర - ముష్టికులను మట్టికరిపిస్తూండటంతో కంసునికి ముచ్చెమటలు పోయసాగాయి.

మాటిమాటికి అంతటి మల్లయోధులు కూడా, నేలమీద వ్రాలు తూండడం చూసిన కంసుడు వారిని ఉత్సాహపరచాలని మృదంగాది వాయుద్యాలు మ్రోయింప ఆజ్ఞాపించాడు. ఈలోగా దేవతలు ఆకసముపై నుండి, దేవదుందుభులు మ్రోగించి శ్రీకృష్ణుని ఉత్సాహపరచగా, చాణూరుని ఒక్కసారిగా పైకెత్తిపట్టి నేలకేసి కొట్టేసరికి, వాడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.

బలరాముడు కూడ ఇదేరీతిగా ముష్టికునితో పోరాడి; అతడి నడినెత్తిన పిడికిలి పోట్లు కుమ్మరించి, మోకాలితో రొమ్మునగ్రుమ్మి భూమ్మీద పడిపోయేలా చేశాడు. తిరిగి అతడు శక్తిపుంజుకుని తేస్తాడేమో అని ఉత్సాహంగా ఎదురుచూసిన కంసవర్గాన్ని నిరాశపరుస్తూ వాడు భూమిమీదనే మట్టికరచి పడిపోవడంతో దెబ్బతిన్న కంసుడు, ఎడాపెడా ఆజ్ఞలు వేసి యాదవులందర్నీ ముసలి - ముతకా అనైనా చూడక బంధించవలసిందని, గోపాలకులిద్దరికీ కూడా సంకెళ్లు వేయవలసిందని అక్కడ్నుంచి రోషంగా వెళ్ళిపోబోయాడు.

ఆ విధంగా ఆజ్ఞాపించిన కంసుని, మధుసూదనుడు హేళనచేసి "ఇంత ద్వంద్వయుద్ధం చేసికూడా, నీలో మార్పురాలేదంటే నువ్వు మూర్ఖుడువని తెలుస్తూనే ఉంది; నీ ఆజ్ఞలిక పాలించువారెవరూ లేకుండా చేసెదగాక" అంటూ కంసుని మీదకు ఉరికి, జుట్టుపట్టిలాగి అతడి కిరీటం నేలకు రాలగొట్టి తాను స్వయంగా కంసునితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు.

కంసుని గుండెలపైకెక్కి కూర్చున్న ఆ హరి భారాన్ని ఆ అల్పదానవుడెక్కడ మోయగలడు? ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ ఆ వెంటనే ప్రాణాలు విడిచాడు కంసుడు. ఆ దానవుని మల్లయుద్ధరంగ వేదికమీదకు ఈడ్చుకొచ్చి అందరు జయజయధ్వానాలు చేస్తూండగా లాగిపడేశాడు.

తన అన్నను వధించడం కళ్లారా చూసిన కంసుని సోదరుడు సునాముడనేవాడు, అప్పటికప్పుడే సమాయత్తమై రంగమంటపంపైకిరాగా, బలరాముడతని ఎదుర్కొన్నాడు. విలాసంగా ఎడంచేత్తో వాడినీ మట్టికరిపించాడు బలభద్రుడు.

కంస సోదరుడూ మరణించేసరికి, మంత్రి సామంతాదులంతా కళ్ళుతెరచి "పాహిమాం కృష్ణా! నీవు జగదేకశూరుడివని తెలియని మా అజ్ఞానాన్ని మన్నించు! ఈ దుష్ట దానవునికి భయపడి ఈతని పక్షమున చేరిన మమ్ము దయతలచి కాపాడు" అంటూ శరణువేడుకొగా వారంతా కంస భయకంపితులై ఉన్న వైనం గుర్తెరిగిన హరి, వారిని క్షమించాడు. అక్కడేవున్న తన నిజ జననీజనకులైన దేవకీ - వసుదేవులకు నమస్కరించడానికి శ్రీకృష్ణుడు వెళ్లగా, వారే స్వామికి వ్రణతులై "జగత్ప్రభూ! నమస్కరింపదగినవాడివి నీవే! నీ అనుగ్రహము మాపై ఇంతకుముందు దయచేసినట్లే ఇటుపైన కూడ కొనసాగనిమ్ము" అని వేడుకున్నారు. తాము "సాక్షాత్‌ విష్ణువుకే జననీజనకులన్న పేరు యుగయుగాల పర్యంతం నిలిచిపోగలదని ఆనందించి" మాకు ఏవిధమైన మోహము కలగకుండా కాపాడు" అని కోరుకున్నారు.

ఆ విధంగా తత్త్వజ్ఞాన దర్శన కలిగిన దేవకీ వసుదేవులను కరుణించిన శ్రీహరి, యాదవజనాన్ని మోహపెట్టడానికి తన వైష్ణవమాయ విస్తరింపజేశాడు.

దేవకీ వసుదేవౌతు దృష్ట్వా మాయాం పునర్హరిః |
మోహాయ యదు చక్రస్య వితతాన స వైష్ణవీమ్‌ ||

తదుపరి బలరామకృష్ణులు యదువృద్ధులందరినీ మమకార పురస్సరంగా యథావిధి సన్మానించి, పురజనులపై చల్లని చూపులు కురిపించారు. కంసుని భార్యలు శోకతప్తలు కాగా, వారిని హరి ఓదార్చి, ఉగ్రసేనుని వారికి రక్షగా నియమించి తిరిగి మధురకు ఉగ్రసేనుడినే రాజుగా నిల్పాడూ.

అందుకు కారణం ఉంది. యయాతి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశానికి రాజ్యార్హత లేకుండా పోయింది. కనుక - తన సహాయసంపత్తులు నిరంతరం ఉగ్రసేనుడికి లభించగలవని, చెప్పి ఒప్పించి అతడినే రాజ్యాభిషిక్తునిగా చేశాడు కృష్ణుడు. అదంతా భగవల్లీలావిలాం గాక మరేమి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది