మహాభారతం నుండి.. ✍️...నేటి చిట్టికథ





మహాభారతం నుండి.. ✍️...నేటి చిట్టికథ

చాలా ఏళ్ళ క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు.

 ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు.

 పాపం ఆ కొడుకు కాస్తా ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దఃఖపడ్డాడు. 

ఈ సారి చావు లేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేసాడు.

" మనిషై పుట్టాకా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు. అందుచేత ఈ సారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకూంటున్నావో చెప్పు, అన్నేళ్ళు ఆయుష్షు ఇస్తాం" అన్నారు దేవతలు.

" సరే! అలాగైతే - అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే- అది ఉన్నంతకాలం నా బంగారుకొండ బతికుండాలి" అని బాలదిహి కోరుకున్నాడు.

 దేవతలు అలాగే వరం ఇచ్చారు. 

తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి "మేధావి" అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని.

' నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా స్థిరంగా ఎంత కాలమైనా బతకొచ్చు ' అనే గర్వం కలిగింది మేధావికి.

 దాంతో పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు.

ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. 

ధనుసాక్షరి భగ్గున మండిపడి, " నీవు భస్మమైపోతావు పో!" అని శపించాడు.


కాని మేధావికి శాపం తగల్లేదు.
కొండలా ఉన్నాడు.

అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దన్నుగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేసాడు.

 కొండ చీలిపోతూనే మేధావి తల కూడా రెండు ముక్కలైంది.


ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.

వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు ;
పెద్దల్ని యిష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు.
 అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి.

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, సాఠ్యం సదా దుర్జనే ।

ప్రీతిః సాధుజనేనయోః నృపజనే, విద్వజ్జనేచార్జవం  ।

శౌర్యం శతృజనే, క్షమా గురు జనే, నారీజనే ధృష్టతా  ।

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ।।

బంధువుల యెడ దాక్షిణ్యముతోనుండుటయు, సేవకుల యెడ దయతోనుండుటయు, దుర్జనుల యందు కఠినముగా వ్యవహరించుటయు, సజ్జనులయందు ప్రీతి పాత్రమై మెలగుటయు, రాజులయందు నీతితో వారికి అనుగుణముగా వ్యవహరించుటయు, విద్వాంసులయందు క్రమ ప్రవర్తనము లేదా ఋజు ప్రవర్తనము కలిగియుండుటయు, శత్రువులయందు పరాక్రమమును, పెద్దలయందు ఓర్పును, స్త్రీల యందు ద ధృఢచిత్తము కలవారుగానూ యే పురుషులు కనపఱుతురో అట్టివారలే లోకస్థితికి, లోక మర్యాదకి, లోకము యొక్క అస్తిత్వానికీ   కారణభూతులు.

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది