శక్తిరూపం





శక్తిరూపం
ధనం అవసరం వచ్చినప్పుడు అన్ని మార్గాలూ వెతుకుతాం. వాటిని ఎలా అయితే ఒక చోటుకు చేర్చి అవసరానికి ఉపయోగించుకుంటామో, అదేవిధంగా మన శక్తులన్నింటినీ సంపుటీకరించాలి. శక్తి రకరకాలుగా విస్తరించి ఉంటుంది- భౌతిక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తిగా.

పరిపూర్ణుడైన శక్తిమంతుడు ఏకాగ్రతతో అనుసంధానం సాధిస్తాడు. ధారణశక్తితో ఒకే చోట మనసును నిలిపి, అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటాడు. కార్యసిద్ధికి ఇది ఎంతో అవసరం. అన్ని శక్తుల్నీ కూడగట్టుకొని అమిత వేగంతో మేధను అత్యంత లాఘవంగా పని చేయించాలి. అతి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాల్ని చురుగ్గా సాధించాలి.

శక్తిలో మనం ఉన్నాం. మనలో శక్తి ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శక్తిని సమన్వయం చేసుకొని, దేన్ని ఎంతవరకు వినియోగించాలో తెలుసుకొని ముందుకు వెళ్లాలి. భౌతిక శక్తి అవసరమైనప్పుడు మానసిక శక్తుల్ని ప్రయోగిస్తే, అవి పనిచేయవు. మానసిక దృఢత్వం అవసరమైనప్పుడు, భౌతికమైన బండ పద్ధతి పనికిరాదు. కనిపించే శక్తులు పనిచేయనప్పుడు, కనపడని దివ్యశక్తిని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి... అంటారు ఆధ్యాత్మికవాదులు.

శక్తి రూపాంతరం చెందుతుంది. దాన్ని కొత్తగా సృష్టించలేం, నాశనం చేయలేం అని విజ్ఞానశాస్త్రవేత్తలు చెబుతారు. శక్తి అనేది ఆత్మరూపంలో ఉంటుందంటాయి ఉపనిషత్తులు.

శక్తి లేకుంటే ఒక్క పనీ జరగదు. శక్తే నిరంతరం మనలో ఉండి నడిపిస్తుంది. బాహ్యశక్తుల కంటే ఆంతరంగిక శక్తులు గొప్పవి. అవి కనిపించే చెట్టుకు కనపడని వేళ్లలాంటివి. వాటిని సమీకరించుకుంటే సంకల్పశక్తి బాగా పెరుగుతుంది. అందుకే ఆయా శక్తులకు దివ్యత్వంతో ఉండే సంబంధ బాంధవ్యాలు తెలియాలి. అవన్నీ వెలికి వచ్చేందుకు అనువుగా నిర్ణయించిన శాస్త్రీయ విధానాల్ని, సూత్రాల్ని తెలుసుకోవాలి.

శ్రీరాముడు తనకు అవసరమైన శక్తుల్ని సమయానుసారం వినియోగించుకున్నాడు. సందర్భానుసారం వాటిని ప్రయోగించాడు. విజయం సాధించాడు. లక్ష్మణ మూర్ఛ సందర్భంలో హనుమంతుణ్ని పంపించి సంజీవని పర్వతం తెప్పించాడు. సోదరుడి ప్రాణాల్ని కాపాడి యుద్ధం కొనసాగించాడు. రామచంద్రుడు వివేక శక్తిని వినియోగించాడు. అస్త్రం, శస్త్రం, మంత్రం, భావం, పూజ, ప్రార్థన- అన్నింటినీ ఉపయోగించు కున్నాడాయన.

ఉపయోగించనంతవరకు, శక్తులు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి. తమను ఉపయోగించుకొమ్మని అవి చెప్పవు. వాటిని మనమే గుర్తించాలి. గౌరవించాలి. పూజించాలి. సూత్రబద్ధంగా ప్రయోగిస్తే, అంతులేని శక్తి ఆవిర్భవిస్తుంది. ఇదే విషయం అధునాతన కాలంలో అణు విస్ఫోటనం ద్వారా రుజువైంది.

శక్తుల్ని ఒక దగ్గరకు చేర్చడమే సాధకుడి పని. సానుకూల శక్తుల సమీకరణ వల్లనే లోక కల్యాణం సిద్ధిస్తుంది. చిన్నవాడైన కొడుకు ఒక పెద్దరాయిని ఎత్తలేనప్పుడు ‘నా శక్తి నీ శక్తి కాదా!’ అంటాడు తండ్రి. బిడ్డకు సాయపడతాడు. మోయలేని భారాన్ని ఎవరైనా తలకెత్తుకున్నప్పుడు, దైవం తప్పకుండా తండ్రిలా ఆదుకుంటాడని పురాణగాథలు చెబుతాయి.

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిగా మారుతుంది. జ్ఞానశక్తే క్రియాశక్తిగా రూపొందుతుంది. ప్రపంచాన్ని అదే నడిపిస్తుంది. ప్రకృతిని మనిషి అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో తన పాత్రను అవగాహన చేసుకోవాలి. పనులు సమర్థంగా నిర్వహించాలి.

శక్తుల్ని ధ్వంసం చేసుకోకుండా మనిషి జాగ్రత్తపడాలి. అన్ని శక్తుల్నీ ఒక చోట కేంద్రీకరించే ప్రయత్నం నిరంతరమూ సాగాల్సిందే. అతడు ఎంతో శక్తిమంతుడని అందరూ అనుకునే స్థాయికి చేరాలి. అద్భుతాలు సృష్టించడానికి పలు శక్తియుక్తులు అవసరమవుతాయి. అవన్నీ మానవుడిలో పుష్కలంగా ఉన్నాయి. ఆ గది తలుపుల్ని అతడే తెరవాలి. అందుకు నిరంతర తపనతో కూడిన సాధన ప్రధానం.

అర్జునుడు అలవోకగా విలుకాడు కాలేదు. సాధనతోనే అన్నింటినీ గెలుచుకున్నాడు. గురువు మీద గల అపార విశ్వాసమే ఏకలవ్యుణ్ని చరిత్రలో నిలబెట్టింది. కురుక్షేత్రంలోనూ అంతే. పరమాత్మ శక్తే అక్కడ దశదిశలా వ్యాపించింది!





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది