శిశుపాలుడు వంద తప్పులు చేసినా....

*శిశుపాలుడు వంద తప్పులు చేసినా....*

వంద తప్పులు చేసే వరకు శిశుపాలుడికి కృష్ణుడు ఎందుకు అవకాశమిచ్చాడు. శిశుపాలుడు స్వయానా కృష్ణుడికి మేనత్త కొడుకు. సాత్వతి, దమఘోషలకు పుట్టిన వాడే శిశుపాలుడు. శిశుపాలుడు నాలుగు చేతులతోనూ, మూడూ కళ్లతోనూ జన్మించాడు. వికృత రూపంతో జన్మించిన అతడిని చూసి తలిదండ్రులు భయపడ్డారు. అయితే ఈ శిశువుని ఎత్తుకున్నప్పుడు అదనంగా చేతులు, కన్ను అదృశ్యమవుతాయో వారి చేతిలోనే మరణం సంభవిస్తుందని ఆకాశవాణి పలికింది. దీంతో వచ్చివారందరినీ శిశుపాలుడ్ని ఎత్తుకోమనేవారు. అయినా సరే శిశుపాలుని వికృత రూపం పోలేదు.
ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని చేధి రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ని శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. సాధారణ రూపం వచ్చిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన సాత్వతిలో ఎక్కువైంది. తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారిని వేడకుంటే అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఓర్పుతో ఉన్నాడు.

అహంకారంతో విర్రవీగిన శిశుపాలడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. భోజ రాజుల్ని చంపి, వసుదేవుడు యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని కూడా సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రు భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని ఘోరాలు జరిగినా కృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.

ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా చేధి దేశానికి వచ్చిన భీముడిని శిశుపాలుడు ఆదరించాడు. యాగానికి కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వనం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు. శాశ్వత శత్రుత్వంతో ఉన్న శిశు పాలుడు గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు క్రిష్ణుడిని మాట్లాడి అవమానించాడు. భీష్మ పితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. దీంతో కృష్ణుడు సభనుద్దేశించి శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుడిని ఇప్పుడే సంహరిస్తానని చక్రం వేసి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. కృత యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభ కర్ణులుగా, ద్వాపర యుగంలోశిశుపాల దంత వక్త్రులుగా జన్మించిన వీళ్లంతా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయవిజయలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది