సగరుని చరిత్ర-శ్రీ విష్ణు పురాణము
🌸🌸🌸🌸🌺🌺🌸🌸🌸🌸
Part 25
ఆ సగరుడు, జ్ఞానం వచ్చాక తల్లిని ప్రశ్నించి తాము క్షత్రియులై ఉండి ముని ఆశ్రమంలో పేరగడానికి కారణం తెలుసుకున్నాడు. తన తండ్రి అయిన బాహువు, హైహయ తాళజంఘాదులను వారిచేత ఓడించబడి - గర్భస్తంభనం కోసం సవతి విషం పెట్టగా, ఏడేళ్ళపాటు గర్భాన్ని మోస్తూ తన పతిని అనుసరించి అడవిపాలైన తన తల్లి దీనగాథ విన్నాడు.
పరాక్రమించిన సగరుడు హైహయ - తాళజంఘాదులను సంహరించగా, వారి వంశీయులైన శక, యవన, కాంభోజ పప్లవులు వశిష్ఠుని శరణుపొందారు. ఆ మహర్షి వచనం మేరకు, వారిని బ్రతికున్నా, చచ్చినవారిగానే జమకట్టి విడిచిపుచ్చాడు సగరుడు. వీరికి సంస్కార రాహిత్యం కలిగించి బ్రాహ్మణులచేత వెలివేయించాడు. తదుపరి చక్రవర్తియై ఈ ధరాతలాన్నేలాడు.
ఇతనికి ఇద్దరు భార్యలు, మొదటిభార్య కాశ్యప పుత్రిక సుమతి. రెండవ భార్య విదర్భ రాజపుత్రి కేశిని. ఎంతకూ వారివల్ల సంతానం కలుగక పోవడంతో సగరుడు ఔర్వమహర్షిని ఆరాధించగా, అతడు వారిద్దరికీ వరం అనుగ్రహించాడు.
వారిలో ఒకరికి ఒక్కడే కొడుకు, మరొకరికి అరవైవేలమంది పుత్రులు ఉదయించగలరని, ఎవరికేది కావాలో ఆ విధంగా కోరుకోవచ్చుననీ పలికాడు.
బహుసంతానవతి అనిపించుకోవాలన్న కాంక్షతో సుమతి అరవైవేలమంది పుత్రులు కావాలన్నది. కేశిని ఒక్కకొడుకుతోనే సంతృప్తి పడతానన్నది. ఔర్యుడు తథాస్తు అన్నాడు.
కొద్దిరోజులకే కేశిని ఒక్క పుత్రుని కన్నది. అతడు అసమంజసుడు. కాశ్యప తనయకు 60 వేలమంది పుత్రులుదయించారు.
అసమంజసునికి అంశుమంతుడు జన్మించాడు. అసమంజసునిది బాల్యం నుంచే దుర్నడత కావడంతో తండ్రి, ఆ అసమంజసుడిని త్యజించాడు. సగరపుత్రులు అరవైవేలమందీ కూడా తమ అన్ననే అనుకరిస్తూ జగద్వినాశకులై, దేవతల కోపానికి కారకులయ్యారు. దైవాంశ సంభూతుడైన కపిలమహర్షి దేవతలకు అభయమిచ్చాడు.
ఇంతలో సగరుడు అశ్వమేధయాగాన్ని సంకల్పించాడు. యాగాశ్వరక్షకులైన ఆ అరవైవేలమందినీ దాటి, ఆ అశ్వాన్ని ఎవడో హరించి, ఒక బిలంలోనికి ప్రవేశించాడు. చివరి కా గుర్రాన్ని వారు పాతాళంలో కనుగొన్నారు. అక్కడ కపిలమహర్షి చేత శపించబడి వారు బూడిదకుప్పలుగా మారగా, వారి మనుమడు భగీరథుడు గంగను భూమికి రప్పించి వారికి ఉత్తమగతులు కలిగించాడు.
ఆ భగీరథునికి సహోత్రుడు, అతనికి నాభాగుడు - అంబరీషుడు - సింధు ద్వీపుడు - అయుతాయువు - ఋతుపర్ణుడు వరుసగా వంశ విస్తరణ కర్తలయ్యారు.
ఈ ఋతుపర్ణుడనేవాడు, నలచక్రవర్తికి సహాయుడుగా వున్నాడు. అతడు 'అక్షహృదయం' అనే పాచికల విద్యలో నేర్పరి. ఋతుపర్ణుడు తర్వాత - సర్వసకాముడు - సౌదాసుడు - మిత్రనహుడుగా వంశవృక్ష క్రమం సాగింది.
వీరిలో సౌదాసుడు ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం పరిసమాప్తి చేసి వశిష్ఠుడు వెళ్లిపోగా, ఒక రాక్షసుడు ఆ మహర్షి రూపం ధరించి సౌదాసుని వద్దకు వచ్చి నాకు యజ్ఞదీక్షగా మనుష్య మాంసంతో భోజనం పెట్టుమని అడిగి వెళ్లిపోయాడు.
అతడు మాయావి అనీ - అది రాక్షసమాయ అనీ తెలీని సౌదాసుడు నిజంగా గురువే అలా కోరినాడనుకుని, అందుకు అన్నీ సిద్ధం చేసుకుని యాగాంతమందు వశిష్ఠునికి నరమాంసం భోజనంలో వడ్డించేసరికి, అతడు "హరిహరీ! ఇదేమి? ఇంత అరాచకమా? నీకు ఈ నరమాంసమే ప్రీతి కరమగుగాక" అని శపించాడు. తెల్లబోయిన సౌదాసుడు "ఇందులో నా తప్పేమీ లేదు. తాము కోరినట్టే చేశాను" అని పలికేసరికి, వశిష్ఠుడు దివ్యదృష్టితో అనుశీలించి చూసి నిజమే! ఇందులో వీని దోషము లేదు అని నిర్ధారించుకొని, శాపాన్ని పుష్కరకాలానికే పరిమితం చేసి సౌదాసుని అనుగ్రహించాడు.
తనవల్ల పొరపాటు లేనప్పటికీ అకారణంగా శపించిన గురుదేవునిపై కోపంపూని, సౌదాసుడు కూడా జలాంజలి గొని మునికి ప్రతిశాపాన్ని ఇవ్వబోయాడు.
అయితే, అంతలోనే మదయంతి (భార్య) చే నివారింపబడి ఆచార్యునకు శాపమిచ్చుట తగదని గుర్తించి, అప్పటికే మంత్రించినందున ఆ జలాన్ని తన కాళ్ల మీదే పోసుకోవడంతో అతడి పాదాలు వన్నె తరగ్గా అతడు కల్మాషపాదుడని ప్రసిద్ధి చెందాడు. ఇతని పౌత్రుడు మూలకుడు.
ఒకప్పుడు పరశురాముడు, ఈ భూతలంమీద క్షత్రియులన్నవారెవ్వరూ ఉండరాదని పంతముఫూని రాజర్షులందర్నీ చంపుతూ వస్తూన్నప్పుడు, కొందరు స్త్రీలు వివస్త్రలయి మూలకుడ్ని పూర్తిగా చుట్టుకొని ఉండి అతడిని రక్షించారు. అందువల్ల ఈ కల్మాషపాదుని మనుమడు మూలకుడికి 'నారీకవచుడని' పేరు వచ్చింది.
వీరి వంశపరంపర తర్వాత బాగా విస్తరించగా, వీరిలో ప్రముఖులైన వారి గురించి చెపుతాను. ఖట్వాంగుడు దేవాసుర సంగ్రామంలో దేవతలు అర్థించగా, వెళ్లి అసురులను చాలమందిని చంపాడు. అతడ్ని దేవతలు వరం కోరుకోమన్నారు. తన ఆయువెంతో తెలుపగోరాడు. అతనికింకా మిగిలిన ఆయువు అతి స్వల్పకాలమని తెలిసాక, అతడు మోక్షగామి అయి ఆ శేషించిన ఆయువు ముహుర్త కాలము కూడా వాసుదేవునిపై మనస్సు లగ్నం చేసి మోక్షం పొందాడు.
ఈ ఖట్వాంగునికి దీర్ఘబాహువు. అతనికి అజుడు, అజునికి దశరథుడు పుత్రులు. ఈ దశరథుని పుత్రుడే రామాయణగాథ కథానాయకుడైన శ్రీరామచంద్రుడు.