శకుంతల జన్మ వృత్తాంతం

ఆదిపర్వము – 16
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
శకుంతల జన్మ వృత్తాంతం
ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులను చూసి ఇలా చెప్పసాగాడు. యయాతి కొడుకు పూరుడు జనరంజకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. పూరుడి కొడుకు జనమేజయుడు. జనమేజయుని కొడుకు ప్రాచిన్వంతుడు. ప్రాచిన్వంతుని కుమారుడు సంయాతి. సంయాతి కొడుకు అహం యాతి. అహం యాతి కొడుకు సార్వభౌముడు. సార్వభౌముని కొడుకు జయత్సేనుడు. జయత్సేనుడి కొడుకు అవాచీనుడు. అవాచీనుడి కొడుకు అరిహుడు. అరిహుని కొడుకు మహాభౌముడు. మహాభౌముని కొడుకు యతానీకుడు. యతానీకుని కొడుకు అక్రోధనుడు. అక్రోధనుని కొడుకు దేవాతిధి. దేవాతిధి కొడుకు రుచీకుడు. రుచీకుని కొడుకు రుక్షుడు. రుక్షుని కొడుకు మతినారుడు. ఆ మతినార్డు సరస్వతీ నదీ తీరమున పన్నెండు సంవత్సరములు సత్ర యాగము చేశాడు. సరస్వతీ నది అతనిని తన భర్తగా చేసుకున్నది. వారికి త్రసుడు అనే వీరుడు పుట్టాడు. త్రసుని కొడుకు ఇలినుడు. ఇలినుడి కొడుకు దుష్యంతుడు.
దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ సింహాలను, పులులను వెంటాడి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. దుష్యంతుని రాజ్య పాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంభిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ దుష్యంతుడు ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది కణ్వాశ్రమము. కణ్వ మహాఋషి తపస్సు చేసుకునే ఆశ్రమము. ఆ ఆశ్రమములో బద్ధ శత్రువులైన సింహాలు ఏనుగులు,ఎలుకలు పిల్లులు చెట్టాపట్టాలు వేసుకొని సహజీవనం చేస్తుంటాయి.దుష్యంతుడు తన మంత్రులతో "నేను ఒంటరిగా వెళ్లి కణ్వ మహామునిని దర్శించి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి ఒంటరిగా పాదచారి అయి కణ్వాశ్రమానికి వెళ్లాడు.
కణ్వాశ్రమానికి సమీపంలో ఒక అందమైన కన్యను చూసాడు. ఆమె పేరు శకుంతల. శకుంతల కూడా అతనిని చూసింది. అతనిని సాదరంగా ఆహ్వానించింది.
దుష్యంతుడు ఆమెను చూసి "నా పేరు దుష్యంతుడు. ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని. వేట నిమిత్తము ఈ అడవికి వచ్చాను. కణ్వ మహాఋషిని దర్శించుకుందామని ఇక్కడకు వచ్చాను" అనాడు.
"వారు ఇప్పుడే పండ్లు తెచ్చుటకు వేటకు వెళ్లారు. ఇప్పుడే వస్తారు" అని చెప్పింది శకుంతల.
"బాలా నీ తలితండ్రులెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు దుష్యంతుడు.
"ప్రభూ, నేను కణ్వ మహఋషి కుమార్తెను" అని బదులు చెప్పింది.
దుష్యంతునికి అనుమానం వచ్చింది. "ఈమె ముని కన్యక ఐతే నా మనసు ఈమె మీదికి ఎందుకు ఉగ్నం అయింది. కణ్వముని ఆజన్మబ్రహ్మచారి. మరి ఆయనకు కూతురు ఎలా వచ్చింది" అని మనసులో అనుకొని శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలనుకున్నాడు దుష్యంతుడు.
"శకుంతలా, సన్యాసాశ్రమాన్ని పాటిస్తున్న కణ్వ మహామునికి నీవు కూతురు ఎలా అయినావు" అని అడిగాడు.
"మహారాజా, నాకునూ తెలియదు. ఒకరోజు ఒక మునీశ్వరుడు నా తండ్రిగారైన కణ్వ మహామునిని నా పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగాడు. నా తండ్రి ఆ మునీశ్వరునికి చెప్పినది నేను విన్నాను. అది మీకు చెపుతాను వినండి.
ఒక సారి రాజర్షి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడ్డాడు. విశ్వామిత్రుని తపస్సు భగ్నం చెయ్యలి అని అనుకున్నాడు. వెంటనే మేనక అనే అప్సరాను పిలిచాడు.
"మేనకా, నీవు ఎలాగైన విశ్వామిత్రుని వద్దకు వెళ్లి ఆయన తపస్సు భగ్నం చెయ్యాలి" అని చెప్పాడు.
మేనక భయపడింది. "దేవేంద్రా, విశ్వామిత్రుని వద్దకు పోవడానికే నువ్వు మొదలుకొని అందరు దేవతలూ భయపడుతుంటారు. మరి నన్ను ఆయన వద్దకు పోయి ఆయన తపస్సు భగ్నం చెయ్యి అని అడగడం తగునా చెప్పండి. కాని నా శక్తి కొలది ప్రయత్నించి ఆయన మనసును మారుస్తాను" అని చెప్పి మేనక విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసి, ఆయనకు నమస్కారం చేసింది. తన చెలికత్తెలతో, ఆయన దృష్టిలో పడే విధంగా పూలూ కోస్తూ అటూ, ఇటూ తిరుగుగ్తూ ఉంది.
విశ్వామిత్రుడు మేనకను చూసాడు. ఆయన మనస్సు చలించింది. మేనక మీద మనసు పడ్డాడు. తపస్సు కట్టిపెట్టి, మేనకతో కామసుఖాలు అనుభవించ సాగాడు. వారిద్దరికి ఒక ఆడ శిశువు జన్మించింది. వచ్చిన పని ఇపోయింది కాబట్టి మేనక దేవలోకానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చెయ్యడానికి తపోవనానికి వెళ్లాడు.
ఆ పసిబిడ్డ మాత్రం ఏడుస్తూ ఆ ఇసుక తిన్నెల మీద ఉండి పోయింది. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడ కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడాయి. అప్పుడు నా తండ్రి కణ్వ మహాఋషి తన శిష్యులతో అక్కడకు వెళ్లారట. నదీ తీరంలో ఒక ఇసుక తిన్నెమీద, పక్షులచేత రక్షించబడుతున్న ఆ ఆడ బిడ్డను చూసి, ఆశ్రమానికి వచ్చారట. ఆ ఆడ శిశువును నేనే. శకుంతములతో రక్షించబడినది కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేసారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతిరిలా పెంచుతున్నారు. నేను వారిని నా తండ్రి లాగా ఆదరిస్తున్నాను" అని చెప్పింది శకుంతల.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది