పాషండసంభాషణకుఫలం-శ్రీ విష్ణు పురాణము
🌸🌸🌸🌼🌼🌼🌼🌺🌺🌺
Part29
కాబట్టి వేదత్రయధర్మత్యాగంతో భ్రష్టులైన నగ్నులతో సంభాషణగాని - స్పర్శగాని విజ్ఞులు ఆచరించరు. ఇట్టి పాషండుల ఇంట భుజించినా, వాని ఇంట ఆసనం మీద కూర్చుండినా, శయ్యమీద పవళించినా వెంటనే వారితో సమానులవుతారు.
ఇట్టి పాషండుల ఇంటినుంచి దేవ, పితృ, భూత జలము కూడా వెడలిపోతుంది. ఆ గృహయజమానిని మించిన పాపాత్ములుండరు.
భూలోకంలో ఒకానొకప్పుడు శతధన్వుడనే రాజుండేవాడు. అతనిభార్య శైబ్య. ఆమె ధర్మాచరణమున గొప్ప ఆసక్తి కలిగినది. పతివ్రత. సత్యం - శాంతం - శౌచం - దయ - వినయం వంటి సకల సల్లక్షణాలతో విలసిల్లు తూండే మహా ఇల్లాలు. ఆ దంపతులిద్దరూ దేవాధిదేవుడైన జనార్దునుడిని భక్తితో జపహోమార్చన ఉపవాసాదిక్రియలతో అనునిత్యం ఆరాధిస్తుండేవారు.
ఒకరోజు ఆ రాజదంపతులు (కార్తీక పౌర్ణమి సందర్భాన) గంగానదిలో స్నానం చేసి, ఉపవసించి ఉన్న తరుణాన, అనుకోకుండా వారికంట ఒక పాషండుడు పడ్డాడు. కాని, దురదృష్టవశాన అతడు మహారాజుకు మిత్రుడు. తప్పనిసరి అయి, రాజు అతడితో ఆదరపూర్వకంగా సంభాషించాడు. శైబ్యకు ఈ విషయం తెలిసి వున్నందున ఆమె ప్రాయశ్చిత్తంగా సూర్యుని చూచింది. పైగా మౌనంగా ఉండిపోయింది.
ఆ దంపతులింటికి వచ్చి యథావిధిగావిష్ణువును ఆరాధించారు. దానధర్మాలు చేశారు. ఇంకా చాలాకాలం పాటు విష్ణుభక్తిని కలిగి జీవితాంతం మెలిగారు. కొంతకాలానికి శతధన్వుడు మరణించాడు. మహాపతివ్రత అయినందున అతని పత్ని శైబ్య కూడా భర్తతో పాటు సహగమనం చేసి తనువుచాలించింది. పాషండ సంభాషణ ఫలితంగా ఆ రాజుకు కుక్కజన్మ సంప్రాప్తించింది. విష్ణుభక్తి తత్పరత చేత తిరిగి శైబ్య కాశీరాజుకు కూతిరిగా పుట్టింది. ఆమెకు పూర్వజన్మస్మృతి ఉంది.
యుక్తవయస్సురాగా, కాశీరాజు ఆమెకు వివాహం తలపెట్టేసరికి, ఆమె తండ్రిని వారించింది. పూర్వజన్మ జ్ఞానం చేత తన భర్త విదిశానగరంలో కుక్కగా పుట్టినట్లు తెలుసుకున్నది. అక్కడకు వెళ్లి అ రీతిగ జన్మించిన భర్తను చూసి, హృదయంద్రవించి చక్కని ఆహారాన్ని తినడానికి పెట్టింది. పూర్వజన్మస్మృతి లేని ఆ శునకం తన జాతిలక్షణాన్నే ప్రదర్శిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూంటే, ఆ కాశీరాజ తనయకు ఏం చేయడానికీ పాలుపోలేదు.
అప్పుడామె తన పతికి నిజమెరిగించుటే ఉత్తమమని భావించి, ఆ శునకం చెవిలో "నీవు శతధన్వమహారాజువు, పూర్వజన్మలో విష్ణుపూజాసక్తుడివై ఉండీ, ఒక పాషండుని దర్శించిన పాపానికి ఇలా అయ్యావు" అని చెప్పేసరికి, ఆ జీవి గొప్ప నిర్వేదం చెంది, ఒక కొండ శిఖరాన్నెక్కి అక్కడ్నుంచి దూకి తనువుచాలించి, ఒక నక్కగా పుట్టింది.
కాశీరాజు తనయ అది కూడా తెలుసుకుని, ప్రయత్న వశాన ఆ నక్కను చేజిక్కించుకొని తిరిగి అదే బోధ చేసింది. నక్కరూపంతో ఉన్న శతధన్వుడు చింతిస్తూ నిరాహారంగా ప్రాణాలు విడిచి, ఈ సారి తోడేలు జన్మ ఎత్తాడు. తిరిగి ఆమె ప్రయత్నించి, ఆ తోడేలుకు నిజమేమిటో చెప్పగా అటుపైన గ్రద్ధ, కాకి జన్మలు సంప్రాప్తించాయి. ఆయాజన్మల్లోనూ ఆమె తనపతిని మరణేచ్ఛవైపు మరలించింది. తదుపరి కొంగ, నెమలి జన్మలు సంప్రాప్తించాయి.
చివరికారాజు నెమలిజన్మలో ఉండగా - జనకచక్రవర్తి చేస్తున్న అశ్వమేధయాగంలో దీక్షాంతస్నానవేళ, నెమలికి స్నానం చేయించి పూర్వజన్మల న్నిటి క్రమాన్ని గుర్తుచేసేసరికి, ఆపక్షిరూపాన్నీ త్యజించి, జనకప్రభువు పుత్రుడై పుట్ట్టాడు.
అటుపైన ఆమె తన తండ్రిని వివాహానికి ప్రేరేపించగా, ఆరాజు స్వయంవరాన్ని ఏర్పటుచేశాడు. జనకమహారాజు పుత్రుడా స్వయంవరానికి రాగా ఆమె తన పతిని గుర్తించి, తిరిగి రాచజన్మలోనే అతడ్ని కలుసుకున్నది. అతడు చిరకాలం మామెతో సుఖించి, తన తండ్రి గతించాకా విదేహ రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా యజ్ఞాలు చేశాడు. బహుదానాదికాలు జరిపించాడు. న్యాయంగా భూమిని పరిపాలించాడు. శత్రురాజుల్ని జయించాడు. పుత్రవంతుడయ్యాడు. క్షాత్రధర్మం ప్రకారం తన ప్రాణాల్ని యుద్ధభూమిలో వదిలాడు. ఆమె వెనుకటిలాగే సహగమనం చేసింది.
యుద్ధంలో మరణించడం చేత వీరస్వర్గాన్ని అలంకరించాడా విదేహరాజు. పతివ్రత గనుక ఆమెకూడా ఇంద్రాదిలోకాలకు పైనున్న యక్షలోకాలకు చేరుకుంది. దీనితో పాటు విష్ణుపూజాదురంధరులైనందున ఆ ఇరువురూ చిరకాలం స్వర్గసౌఖ్యాలనుభవించి, మోక్షదాయకమైన విష్ణుపదం పొందారు. ఇదీ శతధన్వోపాఖ్యానం.
నాస్తికునితో సంభాషిస్తే వచ్చేదోషం, అశ్వమేధంలో అవబృధస్నాన మహిమ విన్నావు కదా మైత్రేయా! కనుక పాషండులతో ఎన్నడూ సంభాషించరాదు. యజ్ఞాదికర్మలలో అసలు పనికిరాదు. ప్రాయశ్చిత్తవిధి తెలిసివుంటే, ఇటువంటివి సంఘటిల్లినపుడు వెంటనే దోషనివారణ చర్య చేపట్టగలరు కనుక ఈ ఉపాఖ్యానం చెప్పబడింది.
వికర్మలను ఆచరించేవారిని 'బిడాలవ్రతులు' అంటారు. కనిపించేలాగ అపకారం తలపెట్టేవారిని 'శఠులు' అంటారు. ప్రతిపనికీ ఏమి హేతువు అంటూ కారణం వెతికేవారు - సందేహించేవారిని 'హైతుకులు' అంటారు. అధోదృష్టి చేత స్వార్థం సాధించడమే పరమావధిగా గల దుర్మార్గులు, అవినయంతో ప్రవర్తించేవారు 'బకవ్రతులు' అనబడతారు. ఈ నాలుగురకాలవారితో ఏకసమానులు 'పాషండులు'.
కనుక ఈ దుర్నడతగల ఐదురకాల వారినీ సజ్జనుడైనవాడు దూరంగా ఉంచుతాడు. వీరిమాటను లక్ష్య పెట్టకూడదు. (పునరుక్తి దోషం వర్తించని విధంగా)పాషండులతో సంపర్కంకూడదని - అది దురాచారమని మళ్లీచెప్పబడింది. కనిపించినందువల్లనే శ్రాద్ధన్ని పాడుచేయగల నగ్నులు వీరు. వీరితో చేసే ఒక సంబాషణ ఒక రోజు పుణ్యాన్ని హరిస్తుంది.
వ్యర్థంగా జటాజూటం పెంచుకొనేవారు, శిఖలేకుండా శిరోమండనం చేయించుకొనేవారు, దేవతాపితృదేవతాప్రీత్యర్ధం ఉపయోగించని అన్నం తినేవారు, శౌచంలేని వారు, పితరులకు పిండం పెట్టని వారు నరకాన్ని పొందుతారు.