ఆదిపర్వము – 19

ఆదిపర్వము – 19
🌺🌺🌼🌼💐💐🌼🌼🌺🌺
శంతనుడి జన్మవృత్తాంతం
భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. భరత వంశానికి వంశకర్త అయ్యాడు. అటువంటి భరతునికి భుమన్యుడు జన్మించాడు. భుమన్యుడి కొడుకుసుహోత్రుడు. సుహొత్రుడికొడుకు హస్తి. అతని పేరు మీదనే హస్తినా పురం వెలిసింది, అదే కౌరవుల రాజధాని అయింది.
హస్తి కొడుకు వికుంఠనుడు, వికుంఠనుడి కొడుకు అజ ఘీడుడు. అజ ఘీడుడికి 124 మంది కుమారులు. అందులో సంవరణుడు అనే వాడు సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహం చేసుంకున్నాడు. వారికి మరొక వంశకర్త అయిన కురు జన్మించాడు. అతని పేరు మీదనే కురు వంశం మొదలైంది. భారత యుద్ధం జారిగిన ప్రదేశం కూడా అతని పేరు మేదనే కురుక్షేత్రం అని పిలువబడింది.
కురునకు విదూరధుడు పుట్టాడు. విధూరధుని కొడుకు అనశ్వుడు. అనశ్వుని కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు భీమసేనుడు. భీమసేనుడి కొడుకు ప్రదీపుడు. ప్రదీపుని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుని కుమారుడు శంతనుడు, శంతనుడికి గంగాదేవికి దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. శంతనునికి యోజన గంధి అయిన సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు.
అప్పుడు జనమేజయుడు వైశంపాయనుని చూసి, "వైశంపాయన మహర్షీ, శంతన మహారాజుకూ, గంగాదేవికి ఎలా కలిసింది. వారికి భీష్ముడు ఎలా పుట్టాడు వివరించండి" అని అడిగాడు.
వైశంపాయనుడు శంతనుడి, భీష్ముడి జననం గురించి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు.
పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనే వాడు వెయ్యి అశ్వమేధ యాగాలు, నూరు రాజసూయ యాగాలు చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ దేవతలతోనూ, మహాఋషులతోనూ, బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు.
ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచి, గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకిలేచి గంగాదేవి తొడలు కనపడ్డాయి. దేవతలందరూ తలలు పక్కకు తిప్పుకున్నారు, కాని మహాభీషుడు ఆసక్తిగా చూస్తున్నాడు.
బ్రహ్మదేవునికి, ఇది చూసి కోపం వచ్చి "మహాభీషా, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించుము" అని శాపం పెట్టాడు.
తన తప్పు తెలుసుకున్న మహాభీషుడు "బ్రహ్మదేవా, భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు. కాబట్టి అతనికి కొడుకుగా జన్మిస్తాను" అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు సరేనన్నాడు.
ఇదిలా ఉండగా, గాలికి చీర తొలగినప్పుడు, తన తొడలను చూసిన మహాభీషుని చూసి గంగాదేవి మోహించింది. అతనినే తలచుకుంటూ భూలోకానికి వస్తుంటే, ఎనిమిది మంది వసువులు ఆమెకు ఎదురు పడ్డారు. దీనంగా ఉన్న వారిని చూసి కారణం ఏమిటీ అని ప్రశ్నించింది గంగాదేవి.
అప్పుడు వసువులు "అమ్మా గంగాదేవి, మాకు వశిష్ట మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలెనని పోతున్నాము, నువ్వు ఎదురు పడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము, మహాభీషుడు మానవలొకంలో ప్రతీపునకు శంతనుడిగా జన్మిస్తాడు. నీకు అతనికి సంగమము అవుతుంది. నీకూ, శంతనునికి మేము జన్మిస్తాము" అని అడిగారు.
గంగాదేవి కూడా సంతోషించింది. నా కోరికా అదే, కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పింది.
"అమ్మా, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు భూలోకం నుండి ముక్తిను ప్రసాదించు. మాకు వశిష్ట మహర్షి కూడా అలాగె అనుమతి ఇచ్చాడు" అని చెప్పారు.
గంగాదేవి ఆలొచనలో పడింది. "మీరు చెప్పింది బాగానే ఉంది, కాని నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక్క కొడుకు కావాలి. అది ఎలాగా?"అని అడిగింది.
"అమ్మా గంగాదేవి, మాలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశలతో, దీర్ఘాయువుగా నీ కన్న కొడుకై మానవ లోకంలో ఉంటాడు" అని చెప్పారు.
గంగాదేవి, అష్ట వసువులు అలా ఒప్పందం చేసుకొని వెళ్లిపోయారు.
మానవ లోకంలో ప్రతీపుడు అనే మహారాజు రాజ్య భోగాలను అనుభవించి, గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షం అయింది. ఒక దివ్య కాంత రూపంలో అతని కుడి తొడమీద కూర్చుంది.
ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. "నీవు ఎవ్వరు? నా తొడమీద ఎందుకు కూర్చున్నావు?" అని అడిగాడు.
"ప్రతీప మహారాజా, నేను జహ్ను మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను    వచ్చాను. నన్ను స్వీకరించు" అని అడిగింది.
"ఓ జాహ్నవీ, నాకు ఇప్పటికే పెళ్లి అయింది, నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో తలవను. అయినా నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా?. పైగా ఆడవారు భర్త ఎడమ తొడమీద కూర్చుంటారు. పుత్రులు తండ్రి కుడి తొడపై కూర్చుంటారు. నువ్వు నా తొడపై కూర్చున్నావు, కాబట్టి నా కొడుకును వరించి పెళ్లి చేసుకొనుము" అని చెప్పాడు ప్రతీపుడు.
గంగాదేవి అక్కడ నుండి వెళ్లిపోయింది.ప్రతీపునకు, అతని భార్య అయిన సునందకు, మహాభీషుడు, బ్రహ్మ శాపం ప్రకారం, శంతనుడు అనే పేరుతో జన్మించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది