శ్రీ మహావిష్ణువు
మొదటి అవతారం :
మత్స్యావతారం
వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు.
అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు.
ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి
ఒకచిన్న చేపపిల్ల వచ్చింది.
దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే,
‘ఓ రాజా! నీవు దయాత్ముడివి...
నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో
ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను అంది.
దానితో ఆ రాజు,
తన కమండలంలోని నీటిలో
చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు.
తరవాత ఆ చేపకు కమండలం
సరిపడక నూతిలో వేయగా,
అదీ సరిపోలేదు.
పరిణామం క్రమక్రమంగా పెరిగిన
ఆ చేపకు సరోవరంగానీ,
నదిగానీ,
సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ
లక్షల యోజనాలను ఆక్రమించింది.
ఆశ్చర్యపడుతూ..
ఆ రాజు "నీవెవరవు?" అని,
ఆ చేపను ప్రార్ధించగా...
ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది.
"శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడు..
ఆ మత్స్యం ఇలా జవాబిచ్చింది.
"రాజా! నేటికి 7వ దినమునకు
బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది.
అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది.
నా మహిమ వల్ల
ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది.
ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ,
దివ్య ఓషధులను,
తిరిగి సృష్టికోసం అవసరమైన మూలబీజాలనూ
పదిలం చేసి
నా శృంగము (ఒంటి కొమ్ము)తో
ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటించెదను" అని చెప్పెను.
ప్రళయం సంభవించి,
ధరిత్రి మొత్తం సముద్రంలో
మునిగిపోయినప్పుడు, లీలామానుష వేషధారి అయిన
ఆ శ్రీమన్నారాయణుడు ధగధగమని కాంతులీనే
సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి,
సత్యవ్రతునికి ఒక దేవనౌకను అనుగ్రహించాడు.
స్వామి ఆదేశానుసారం
సత్యవ్రతుడు ఆ నౌకలో
సమస్త ఔషధులను,
బీజాలను నింపడమే కాక-
సప్త రుషులను అందులోనికి పంపి,
వాసుకిని తాడుగా ఉపయోగించి,
దివ్యకాంతులతో వెలిగిపోతున్న
మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు.
ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ
ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీస్తాడు.
ఇదే అదనుగా చూసుకొని సోమకాసురుడు రాక్షసుడు
బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు.
శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
మత్స్యనారాయణుడు
తన అవతారంలో సమాజ హితానికి,
అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా
అనుగ్రహించాడన్నది పురాణగాథల సారాంశం.
మత్స్యావతారస్వామి శ్లోకం:
వేదనుద్దరతే జగన్నివహతే
భూగోళముద్విభ్రతే దైత్యం ధారయతే
బలిం చలయతే క్షత్ర క్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయితే
కారుణ్య మాతన్వతే మ్లేచ్చాన్ మూర్చయతే
దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః
మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైక దేవాలయం మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు.
వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక,
మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు,
అరుదైన నిధులు లభ్యమవుతాయి
సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు.
సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే,
వేదాలు విజ్ఞాన సర్వస్వం!
మత్స్యావతార సందేశం ఏమిటంటే-
అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ,
మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది!
ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని,
మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని,
విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలని ‘మత్స్యావతారం’ ప్రబోధించింది.