ఈమధ్య ఒక యువతి మాట్లాడుతూ – “నాకు ‘భగవద్గీత’ పేరు విన్నా, అందులో శ్లోకాలు విన్నా, భయం వేస్తుంది. ఒళ్ళు వణుకుతుంది’ అన్నది.
ఎందువల్లనమ్మా?’ అని ఆశ్చర్యంతో అడిగితే, ఆమె చెప్పిన సమాధానం మరీ దిగ్భ్రమను కలిగించింది – ‘ఎవరైనా చనిపోయినప్పుడు, శవవాహన సమయంలో దీని రికార్డు వేస్తారు. అదే నా మనసులో ముద్రించుకు పోయింది. పెద్దలు ఎవరైనా మరణిస్తే సంతాపంగా దీనిని వినిపిస్తారు. ఇందువల్లనే నాకు గీతా శ్లోకాలన్నా గానమన్నా భయం పట్టుకుంది.”.
మరొకచోట మరొక సంఘటన – ఒక సభా ప్రారంభంలో ఎవరో భగవద్గీత శ్లోకాలు చదివారు. అందులో ఒక రాజకీయ నాయకుడు లేచి – ‘శుభమా అని సభ పెట్టుకుంటే గీత పాడతారేంటి?’ అని వాపోయాడు.
ఇంచుమించు చాలామంది వద్ద ఇలాంటి అభిప్రాయాలే వినబడ్డాయి.
దీనిని బట్టి – హిందువులు తమ ధర్మవిషయంలో ఎంతగా భ్రష్టమయ్యారో, పశుప్రాయులయ్యారో తెలుస్తోంది.
దీనికి కారణమేంటి?
‘భగవద్గీత’ను కేవలం మరణ సందర్భంలో రికార్డులద్వారా వినిపించడం! ఇది అసంగతమైన విషయం. అసలు భగవద్గీతకీ మరణ సంస్కారాలకీ సంబంధమే లేదు. ఆ సమయంలో భగవద్గీత, విష్ణుసహస్రనామాలు, శివనామాలు – వంటి వాటి అవసరం లేదు.
ఇతరులకైతే ‘పిండికీ, పిడుగుకీ ఒకటే మంత్రం’ అన్న చందంగా పెళ్ళికీ, చావుకీ, పుట్టుకకీ అన్నిటికీ ఒకటే గ్రంథపఠనం!
సనాతనధర్మం పరిస్థితి అటువంటిది కాదు. జన్మ ప్రభ్రుతి మరణపర్యంతం ‘షోడశసంస్కారాలు’ ఉన్నాయి. ఆయా సందర్భాలలో చేయవలసిన కర్మలు, మంత్రాలు ఉన్నాయి. అంతేగానీ అప్పుడు గీతాపఠనం చేయరు.
జ్ఞానం కోసం భగవద్గీత. అంతేకానీ – ఔర్ధ్వదైహిక క్రియలకోసం కాదు. మన సంస్కృతిలో ఆ క్రియలు సంస్కారాలు చక్కని విజ్ఞానంతో కూడి ఉన్నాయి. వాటికి భగవద్గీతతో పొంతన లేదు. గీత బ్రతికి ఉన్నవారు, చక్కగా బ్రతకదలచుకున్న వారు అధ్యయనం చేయవలసిన జ్ఞానశాస్త్రం.
ఈ విషయం మరచి కేవలం మరణ సమయగానంగా దానిని వినిపించడం మహాపరాధం. వెంటనే బాధ్యతగల పెద్దలు పూనుకొని వల్లకాట్లలో, శవవాహనాలలో, సంతాపాలలో గీతాపాఠాన్ని నిషేధించాలి.
మరో విషయం – ఇతరమతస్థులు వారి మరణవేళల్లో వారి మతగ్రంతాలనే చదువుతారు. కానీ దానిపై ఆ మతస్థులకి భయం, హీన దృష్టి లేవు. కానీ మనవారికి ఆ రెండూ ఏర్పడ్డాయి.
బాల్యంనుండే ఇంట్లో పిల్లలకి ఆ గ్రంథాల గురించి తెలియజేయని పెద్దలది ప్రథమాపరాధం! ఇంట్లో ఆ పుస్తకాలనుంచడం లేదు. శ్లోకాలు నేర్పడం లేదు. అసలు వాటి అర్థాలు కూడా తెలియవు.
ముస్లిం సోదరులు ఉర్దూ నేర్చుకుని ఖురాన్ ని చిన్నతనం నుంచే అధ్యయనం చేస్తారు. మతాచారాలను అనుసరిస్తారు.
కానీ మన ఇళ్ళల్లో సంస్కృతం నేర్పరు. కనీసం తెలుసు పద్యాలు తెలుసుకోరు.
అందుకే గీతా జ్ఞానం లేదు సరికదా – ఏ సందర్భానికి ఏది చేయాలో కూడా తెలియని దయనీయ స్థితి.
దీని కారణం గానే స్వధర్మ నిష్ఠ కలగడం లేదు. ఆఖరికి ‘గోవింద’ నామమన్నా కొందరికి శవయాత్రయే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. మానవుని కర్తవ్యోన్ముఖుని చేసి, వ్యక్తిత్వాన్ని వికసింపజేసి, తనలోని అంతశ్శక్తులను జాగృతపరచి వినియోగింపజేసే శక్తి గీతా బోధలలో ఉంది. ఈ విషయం ఎందఱో విదేశీ మేధావులు అంగీకరించి విజయ సూత్రాలుగా, వ్యక్తిత్వ వికాస పాఠాలుగా అధ్యయనం చేస్తున్నారు. మనం మాత్రం అసలు పట్టించుకోని స్థితిలో ఉన్నాం.
మరొకవైపు మార్పిడి మతాలు ఎరజూపే బిస్కట్ల కోసం ప్రలోభపడి దాస్యం చేసే గ్రామసింహాలవంటి భారత మేధావులు – గీతవంటి సద్గ్రంథాలకు లేని అర్థాలు చూపించి, కువ్యాఖ్యలు చేస్తుంటే – ‘భావస్వేచ్ఛ’ క్రింద దానిని భరిస్తూ, వాటిని ఖండించలేని స్థితిలో నిద్రిస్తున్నారు గీతాభిమానులు.
ఒక్క గీతనే కాదు. వేదాలను కూడా ఏవో అనువాద గ్రంథాలు చదివి – బట్టతలకీ, మోకాలికీ ముడిపెడుతూ వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ మతంలో గొప్పదేదో చెప్పుకు వెలగబెడితే చాలు. ఇతరుల మతాల గురించి మాట్లాడే హక్కు అవగాహన వారికి లేవు. చట్టరీత్యా నేరం కూడా.
మనవారిలో ఉన్న అవగాహనా రాహిత్యం, ఇతరుల దుర్మార్గపూరిత వంచన కలిసి హిందూమతంలో లేనిపోని అనర్థధోరణులు కలుగుతున్నాయి. హిందూ సమాజం తమ సంప్రదాయాలేమిటో, ధర్మజ్ఞానాలేమిటో గ్రహించే ప్రయత్నం చేయాలి. వాటిని నిలుపుకోవాలి.
దీనికి సాధికారకంగా చెప్పగలిగే పెద్దలు పూనుకొని ఉద్యమించి, జాగరణ కలిగించాలి.