దత్తావతారం
🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమైక్య రూపమే దత్తావతారం. అది త్రిమూర్తుల సమన్వితం. వారి వరప్రభావం వల్ల అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇవ్వడం. అత్రి కుమారుడు కాబట్టి ఆయనను ‘ఆత్రేయుడు’ అనీ పిలుస్తారు. దత్తాత్రేయుడు మార్గశిర పౌర్ణమినాడు అవతరించాడు.
ఉపనయనం తరవాత దత్తుడు తపస్సు ఆచరించాడు. పరిపూర్ణమైన జ్ఞానార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి అనేకమందికి ఆయన ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు అనే గ్రంథాలు రచించాడు.
దత్తుడు మహాత్ముడు. ఆయనే ఆదిగురువైన పరబ్రహ్మం. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్య రూప విలక్షణ మూర్తి. ఆయన చుట్టూ ఉన్న నాలుగు ప్రాణులే నాలుగు వేదాలు. అహంకారాన్ని దండించడానికే దండం ధరించానని, జోలె పట్టింది భక్తుల సంచిత కర్మలకోసమేనని ప్రవచించాడాయన.
దత్తాత్రేయ బోధలు లోక కల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం స్వీకరించాలని ఉద్బోధించాడు. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సముద్రజలం నుంచి గాంభీర్యాన్ని, కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. అప్రయత్నంగా వచ్చే ఆహారాన్ని మాత్రమే మానవులు స్వీకరించాలి. కొండచిలువలా భ్రాంతి వలలో పడకూడదు. స్పర్శానందానికి దూరంగా ఉండటం అంటే ఏమిటో మిడతను చూసి తెలుసుకోవాలి. ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన అలవరచుకోవాలి. చీమలా జిహ్వచాపల్యానికి లోను కారాదు. అప్పుడే సుఖానికి మూలం అవగతమవుతుందని దత్తాత్రేయుడు ప్రబోధించాడు.
మానావమానాల్ని సమానంగా చూడటాన్ని బాలల నుంచి నేర్చుకోవాలి మనిషి. వృద్ధిక్షయాలు శరీరానికే గాని ఆత్మకు కావన్న అక్షర సత్యాన్ని చంద్రుడి నుంచి గ్రహించి మసలాలి. లేడి నుంచి త్యాగనిరతిని, సాలె పురుగు నుంచి ‘సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మే’నన్న తెలివిడిని పొందాలి. ఆత్మానందం దొరికే చోట సంచరించాలని సీతాకోక చిలుక నుంచి నేర్వాలి. ఆర్తుల్ని కాపాడే పారమార్థిక చింతను జలం నుంచి సొంతం చేసుకోవాలి. అవన్నీ తానూ నేర్చుకున్నందువల్ల ఎందరో గురువులయ్యారని పలికిన జ్ఞానానందమయుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వామి!
శ్రీదత్తుడు సతీ మదాలస ముద్దుల పట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పించాడు. ఓంకారోపాసన విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను ఉపదేశించాడు. ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానం ప్రసాదించాడు. అవధూతలకే అవధూత, పరమహంసలకే పరమహంస దత్తుడు.
విష్ణుదత్తుడి యోగ్యత గ్రహించిన ఆయన, వేదాంతాన్ని విశదీకరించాడు. తాను చాటి చెప్పినవి లోకుల ఆత్మజ్ఞాన ప్రాప్తికి, మోక్ష తృష్ణకు సోపానాలని వర్ణించాడు. దత్తుడి అనుగ్రహానికి ఎందరెందరో పాత్రులయ్యారు.
త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడి రూపం మూడు తలలతో ప్రకాశిస్తుంది. ఆయనకు మేడిచెట్టు ప్రీతిపాత్రమైనది కావడంతో, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురుదత్తుడికి పదహారు అంశ రూపాలున్నాయని ‘దత్తపురాణం’ చెబుతుంది. అనేకులు దత్తోపాసనతో తరిస్తుంటారు.
‘మత్స్య పురాణం’ శ్రీదత్త చరితను అభివర్ణిస్తుంది. దత్తక్షేత్రాలు 12 అని ఆ క్షేత్ర మహిమల గ్రంథం వివరిస్తుంది. మనుషులందరూ సమానులే. ప్రేమ, అహింస, ఆత్మజ్ఞానం, త్యాగశీలత, భూతదయ వారికి రక్షణ కవచాలు. దత్తతత్వం బోధించే ఇవన్నీ సర్వదా అనుసరణీయాలు!