నిరాడంబరంగా జీవించేవారే భగవంతునికి ఆప్తులవుతారు.


సాధువు బోధనలు
❇🌼❇🌼❇🌼❇🌼❇🌼❇🌼❇🌼❇
రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక అరణ్యం ఉండేది. ఒక సాధువు ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. రామాపురం ప్రజలు ఆయన బోధనలు వినడానికి వెళ్లేవారు. కష్టాల్లో, బాధల్లో ఉన్నవారికి ఆయన వాక్కులు ఎంతో సాంత్వన కలిగించేవి. చల్లని ఆయన చేతి స్పర్శ ఎలాంటి అనారోగ్యాన్నయినా నయం చేసేది.

ఆ సాధువు, ‘‘మోహాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలివేసి నిరాడంబరంగా జీవించండి, పరులకు సహాయం చేసినప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుంది, దానగుణమే అన్నింటినీ మించిన గొప్ప గుణం’’ అని బోధించేవారు.

ఆయన అడవిని వదిలి బయటకు వచ్చేవారు కాదు. రామాపుర ప్రజలు ఎన్నిసార్లు ఆహ్వానించినా ఆయన సున్నితంగా వారి ఆహ్వానాన్ని తిరస్కరించేవారు. ఒకసారి రామయ్య అనే రైతుకు జబ్బు చేసింది. అతను కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. రామయ్య కుటుంబసభ్యుల విన్నపం మేరకు సాధువు మొదటిసారిగా ఆశ్రమం వదిలి బయటకు వచ్చి రామాపురంలో అడుగుపెట్టారు.

ఆయన రాక ఆ ఊరి ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆడవాళ్ళు, మగవాళ్లు, పిల్లలు… అంతా పనులు మానుకుని సాధువును దర్శించుకోవడానికి బారులు తీరారు. అందరూ రకరకాల పిండివంటలు, పంచభక్ష్యపరమాన్నాలు తయారుచేసుకుని వచ్చారు. వాటన్నింటనీ చూసి సాధువు ముఖం నిర్వికారంగా మారిపోయింది. తక్షణమే అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు.

‘‘అదేంటి స్వామీ… ఏమీ తీసుకోకుండా, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. మా మీద మీకు కోపం వచ్చిందా? మేమేదైనా తప్పు చేశామా?’’ అని అడిగారు ఆ ఊరి ప్రజలు.
‘‘నాయనలారా! ఇంతకాలం నేను మీకు ఎన్నో విషయాలు బోధిస్తూ వచ్చాను. మీరు వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తున్నారని నాకిప్పుడు అర్థమైంది. అంతేకాదు మీరు కళ్లుండి, చూడలేని వారు కూడా! నేను ఏం తింటున్నాను? ఎలా జీవిస్తున్నాను? అనే విషయాల్ని మీరు పట్టించుకోలేదు. నిరాడంబరంగా జీవించాలని మీకు చెప్తూ వచ్చాను. మరి ఆ నిరాడంబరతే నాకు వర్తించదా? ఈ పిండివంటలు, పంచభక్ష్యపరమాన్నాలు నాకు కావాలా?’’ అన్నారు ఎంతో శాంతంగా.

దానితో ఆ గ్రామస్థులకు తప్పు తెలిసి వచ్చింది.

నీతి: నిరాడంబరంగా జీవించేవారే భగవంతునికి ఆప్తులవుతారు.

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది