రహస్య ఆరోగ్య సూక్తులు

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు  -

     కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.

రహస్య సూక్తులు  -

* రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.

* ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.

* మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.

* నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను

* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను

* పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .

* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.

* గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.

* శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.

* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .

* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .

* అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.

* కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .

* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.

* ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.

* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.

* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.

* మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .

* ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .

* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .

* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .

* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .

* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .

* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .

* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .

* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .

* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .

* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం

* మినుములు అతిగా వాడరాదు.

* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.

* చవిటి ఉప్పు మంచిది కాదు.

* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.

* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.

* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.

* మలమూత్ర వేగములను ఆపరాదు .

* ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.

* హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .

* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .

* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.

* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .

* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .

* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును

* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .

* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .

* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.

* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .

* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .

* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .

* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .

* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .

* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .

* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.

* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .

* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .

* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.

* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .

* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

* పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .

* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .

* రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.

* మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .

* స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .

* బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .

* నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .

* భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.

* మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .

* అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .

* ముక్కుతో శబ్దం చేయకూడదు .

* పళ్ళు కొరకకూడదు .

     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది.  రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.  ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .

     మరికొన్ని విషయాలు తరువాతి పోస్టులలో తెలియచేస్తాను.
🙏.జై గోమాత🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది