తులసి దాసు


ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్ ఆత్మారాం దుబే మరియు హులసీ దేవి దంపతులకు తులసీదాసు జన్మించారు. పుడుతూనే 'రాం!'  అంటూ పుట్టాడు కనుక ఆయనను 'రాం బోలా' అని పిలిచేవారు. అయితే దురదృష్టవశాత్తు అతని తల్లి మరణించడంతో, తండ్రి ఆదరణ కరువై ఇరుగుపొరుగువారి సాయంతో 'రాం బోలా' పెరిగి పెద్దవాడవుతాడు.
ఒకనాడు వారి గ్రామానికి కొందరు సన్యాసులు వస్తారు. వారిలో ఒక సన్యాసి బాలుడైన తులసీదాసును ఆప్యాయంగా పలకరిస్తాడు. అంతే తులసీదాసు అతని వెంట పయనమౌతాడు. అలా కాశీ చేరిన తరువాత ఆ సన్యాసి తులసీదాసును ఓ పండితుని వద్దకు తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పమని కోరతాడు. ఆ పండితుడు తన కుమారుడితో పాటు తులసీదాసుకు కూడా విద్యను బోధిస్తాడు.
సూక్ష్మగ్రాహియైన తులసీదాసు అతని వద్ద సంస్కృతాన్ని చక్కగా అభ్యసిస్తాడు. పెరిగి పెద్దవాడైన తులసీదాసుకు తన కుమార్తె అయిన రత్నావళిని ఇచ్చి వివాహం కూడా చేస్తాడు.
తులసీదాస్ తన భార్యను విపరీతంగా ప్రేమించేవాడు. ఒకనాడు, ఆమె పుట్టింటికి వెళ్లగా...ఎడబాటు సహించలేక ఆయన గాఢాంధకారంలో, కుంభవృష్ఠిలో, గంగ ఉప్పొంగుతుండగా ఈదుకుంటూ ఆమె చెంతకు వెళ్లాడు.
భర్త చేసిన సాహసం చూసి దిగ్భ్రాంతి చెంది 'ఈ దేహం కోసమా ఇంత ప్రయాస? ఇదే ప్రయాస శ్రీరాముడి కోసం పడుంటే నీ జన్మ చరితార్ధం అయ్యేది' అంటూ ఆమె ఈసడించుకుంది.
అంతే, ఆయన తన తప్పును తెలుసుకొని, గురు బోధను గుర్తుచేసుకుంటూ రాముడి ధ్యాసలో మునిగిపోయాడు.
రామాయణాన్ని హిందీమూలంలో ‘రామచరిత మానస్’ గా అందించిన తొలి కవి. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా రచించాడు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీ, అవధి భాషలలో 24 రచనలు చేశాడు.
బదరీ నుంచి దేశం మొత్తం పర్యటించాడు. చివరికి ఆ మహానుభావుడు కాశీలోనే నిర్యాణం చెందాడు.
🙏🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది